దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలోని తావరెకెరె దొడ్డేరి వద్ద వెలుగు చూసిన నకిలీ ఔషధాల దందా దేశమంతటా వ్యాపించినట్టు రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు అనుమానిస్తున్నారు. ముంబై, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. కురుబరహళ్లి గ్రామంలో నకిలీ ఔషధ ఫ్యాక్టరీపై దాడులు జరిపి భారీ మొత్తంలో పలు రకాల మందులను, యంత్రాలను సీజ్ చేయడం తెలిసిందే. వీటి విలువ రూ.5 కోట్లుగా తేల్చారు. నకిలీ ఔషధ బాగోతంపై పక్క రాష్ట్రాల అధికారులకు లేఖలు రాశారు. అనుమానాస్పద ఔషధాలు, కర్ణాటకలో నిషేధించిన మందులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఎక్కువగా ఖరీదైన మందులకు డూప్లికేట్లను తయారు చేస్తున్నారు. క్యాన్సర్ లాంటి రోగాలకు ఉపయోగించే ఇంజెక్షన్లను లక్ష్యం చేసుకున్నారు. ఈ మందులను వాడితే రోగం ముదిరి త్వరలోనే మరణిస్తారని అధికారులు చెప్పారు.
కేంద్రానికి మంత్రి లేఖ
రాష్ట్రంలో నకిలీ మందుల మాఫియాపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి యూటీ ఖాదర్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. ఇలాంటి మాఫియా దేశంలో ఎక్కడ ఉన్నా గుర్తించాలన్నారు. దర్యాప్తు చేసేందుకు సిట్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఈ స్కాంలో ఎంతటివారు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కల్తీ మందుల దందాపై అధికారుల సందేహం


