నాగేంద్ర రాజీనామా చేసే వరకు పోరాడతాం | - | Sakshi
Sakshi News home page

నాగేంద్ర రాజీనామా చేసే వరకు పోరాడతాం

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

హొసపేటె: వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల దుర్వినియోగం కేసులో ప్రమేయం ఉన్న మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేసే వరకు అసెంబ్లీ లోపల, బయట పోరాటం కొనసాగిస్తామని హడగలి ఎమ్మెల్యే కృష్ణా నాయక్‌ పేర్కొన్నారు. బుధవారం ప్రెస్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాల్మీకి అభివృద్ధి మండలిలో జరిగిన రూ.187 కోట్ల కుంభకోణంలో మంత్రి నాగేంద్ర ప్రమేయం ఉందని అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంగీకరించి ఆయన రాజీనామాను ఆమోదించారని గుర్తు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. దర్యాప్తు సంస్థ ఇంకా క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిని తిరిగి నియమించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. సీఎం డీకే.శివకుమార్‌, కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా మంత్రి నాగేంద్రతో తక్షణమే రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. భయం వల్లా లేక ఒత్తిడి వల్ల మంత్రి నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి ఇచ్చారా? అనే విషయాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం బయటపెట్టాలన్నారు. మంత్రి నాగేంద్రతో రాజీనామా చేయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపడుతుందని అన్నారు. వర్షాభావం నేపథ్యంలో విజయనగరను కరువు జిల్లాగా ప్రకటించి ప్రతి ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం అందించాలి. వీబీజీ రామ్‌జీ పథకం కింద కూలీలకు తగినంత పని కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు చెన్నబసవనగౌడ పాటిల్‌, నాయకులు బ్యాలహుణిసె రామణ్ణ, అయ్యాళి తిమ్మప్ప, అశోక్‌ జీరె, కృష్ణానాయక్‌, సందీప్‌ సింగ్‌, రాఘవేంద్ర, మధుసూధన్‌, జగదీశ్‌ కమతగి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కృష్ణా నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement