శివాజీనగర: జర్నలిస్టుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. బెంగళూరులో శని, ఆదివారం జరిగిన ఐజేయూ సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. జాతీయ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్మూ అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, చట్టపరమైన దాడులు పెరిగిపోవడం, వార్తా సేకరణలో అడ్డంకులు కల్పించడం, రక్షణకు చట్టాలు లేకపోవడం వంటి పరిస్థితులపై ఐజేయూ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలో దేశంలో పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రతకు ఒక ప్రత్యేక బలమైన చట్టం చేయాల్సిన అవసరం ఉందని సమావేశం తీర్మానించింది. ఐజేయూ పూర్వాధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో పత్రికా స్వేచ్ఛ నానాటికీ దిగజారి పోతోందని తెలిపారు. భారత రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛకు గట్టి హామీ ఇచ్చినప్పటికి వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ కల్పించే సమగ్ర చట్టం లేకపోవడం వల్లనే బెదిరింపులు, దాడులు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టుల భద్రతకు చట్టాలు వచ్చినప్పటికి, అవి సమగ్రంగా లేవని పేర్కొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఐ.జే.యూ సెక్రటరీ జనరల్ డీ.సోమసుందర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్, ఎం.ఏ.మాజిద్, అమర్ మోహన్ ప్రసాద్, వై.నరేంద్రరెడ్డి, జాతీయ కార్యవర్శులు డీ.ఎస్.ఆర్.సుభాస్, పీ.భాస్కర్రెడ్డి, నరేంద్ర భరద్వాజ్, ఎం.జానకి మోహన్, అంజన్కుమార్ తదితరులు జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన కర్ణాటక జర్నలిస్టు ప్రముఖులను సన్మానించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రత్యేక చట్టాన్ని తేవాలి
ఐజేయూ కార్యవర్గ భేటీలో తీర్మానాలు


