శివమొగ్గ: మల్నాడులో రుతుపవన వర్షాలు తగ్గినట్లే తగ్గి తిరిగి జోరందుకున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదుల్లో జలకళ ఉట్టిపడుతోంది. శివమొగ్గ వద్ద తుంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 8 గంటల నాటికి తుంగా డ్యాంలోకి నీటి ప్రవాహం 55,197 క్యూసెక్కులకు పెరిగింది. ఒక్కరోజులోనే రెట్టింపు కావడం విశేషం. అన్ని క్రస్ట్ గేట్లను తెరిచి, వచ్చినంత నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆ నీరు తుంగభద్ర డ్యాం వైపు పరుగులు తీస్తోంది.
భద్రాకు ఇన్ఫ్లో
ఒక్కరోజులో జిల్లాలోని పశ్చిమ కనుమలలో ఉన్న చక్రలో 210 మిల్లీమీటర్ల (మి.మీ.) భారీ వర్షపాతం నమోదైంది. మరో ప్రధాన డ్యాం లింగనమక్కి నీటిమట్టం 1778 అడుగులు (గరిష్ట స్థాయి: 1819 అడుగులు)కు చేరింది. 38,183 క్యూసెక్కులు వస్తుండగా, 2 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. భద్ర డ్యాం నీటిమట్టం 157 (గరిష్టం 186 అడుగులు)గా ఉంది. 13 వేల క్యూసెక్కుల జలం వస్తుంటే, అలాగే నిల్వ చేస్తున్నారు.
వర్షాలతో కబినికి జలకళ
మైసూరు: కేరళలోని వయనాడ్, పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రదేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మైసూరు జిల్లాలో కపిలా నదికి ప్రవాహం పుంజుకుంది. హెచ్డీ కోటె తాలూకా బీచనహళ్లి సమీపంలోని కబిని డ్యాం ప్రస్తుతం పూర్తిగా నిండింది. డ్యాం నుంచి 5 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. దీంతో నదీ తీరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రకటించారు. డ్యాంకు 15,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. డ్యాం సామర్థ్యం 2,284 అడుగులైతే, 2,280 అడుగులకు చేరింది. కావేరి నీటిని వదలాలని కావేరి నీటి నిర్వహణ మండలి ఆదేశించడం తెలిసిందే. తాజా ఇన్ఫ్లోతో రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్షాలు ఆదుకున్నట్లయింది. ఔట్ఫ్లో కొనసాగిస్తే కావేరి మండలి ఆదేశాలను పాటించినట్లవుతుంది. వర్షాలతో ధర్మస్థల వద్ద నేత్రావతి నది ఉప్పొంగుతోంది.
తుంగా డ్యాం గేట్ల ఎత్తివేత
కబిని జలాశయం ఫుల్


