బనశంకరి: ఇంట్లో దుష్టశక్తి తిష్ట వేసింది, దానిని తొలగించడానికి పూజలు చేస్తానని ఓ మహిళను నమ్మించి రూ.2.50 కోట్ల నగదును కాజేశాడో నకిలీ బాబా. ఈ ఘటన బెంగళూరు సిటీ చామరాజపేటెలో వెలుగుచూసింది. బాధితురాలు కుముద స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేయగా, నకిలీబాబా అఫ్సర్ పాషా, మధ్యవర్తులు శంకర్, భరత్ పై కేసు నమోదైంది. వివరాలు.. కుముద కుటుంబంతో జీవిస్తోంది. తన ఇంటిపై రుణం తీసుకోవాలని అనుకుని తెలిసినవారి ద్వారా లోన్ ఏజెంట్లు భరత్, శంకర్లతో మాట్లాడింది. కుముద కుమారుడు బైకు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇది తెలిసి భరత్, శంకర్ ఆమెను.. మీ టైం బాగాలేదేమో, ఇంట్లో దుష్టశక్తులు ఉండటంతో ఇలా అయ్యింది, మాకు ఒక బాబా తెలుసు, ఆయనతో క్షుద్ర పూజలు చేయిస్తే ఆటంకాలన్నీ పోతాయి అని మభ్యపెట్టారు. అలా మొదట రూ.8 లక్షలు తీసుకుని పూజచేయించారు.
రూ.505 కోట్లు వస్తాయని..
తనకు రిజర్వుబ్యాంకు నుంచి రూ.505 కోట్లు రావాల్సి ఉంది, అది విడిపించుకోవడానికి రూ.2.50 కోట్ల ఫీజులు చెల్లించాలి, మీరు ఇళ్లు విక్రయించిన డబ్బు ఇస్తే పని పూర్తయ్యాక రూ.10 కోట్ల ప్రతిఫలం ఇస్తానని బాబా ఆమెను ప్రలోభపెట్టాడు.
సరేనన్న కుముద తన ఇంటిని రూ.8.50 కోట్లకు అమ్మేసి, అందులో నుంచి రూ.2.50 కోట్లు నకిలీ బాబాకు ముట్టజెప్పింది. నగదు అందగానే నకిలీబాబా, ముఠా మాటమార్చారు. ఏవో సాకులు చెబుతూ తప్పించుకునేవారు. కుముద డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో చంపేస్తామని బెదిరించారు. మోసపోయినట్లు గుర్తించిన కుముదా సీసీబీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉండగా గాలిస్తున్నారు.
బెంగళూరు మహిళకు
నకిలీ బాబా టోపీ


