మైసూరు: విశ్వశాంతి కోసం మైసూరులోని అవధూత దత్త పీఠం గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో దత్త విజయానంద తీర్థ స్వామీజీ 23వ చాతుర్మాస్య వ్రత దీక్షా మహోత్సవం బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. వ్యాస పూర్ణిమ నేపథ్యంలో గురు దత్తాత్రేయ స్వామి, వ్యాసులు, గణపతి సచ్చిదానంద స్వామీజీ గురువుల మాతృశ్రీ, శంకరాచార్యులకు అర్చన, మహాపూజ, మంగళ హారతిని నిర్వహించారు. గురుపూర్ణిమ సందర్భంగా గురుపరంపర పూజ, వ్యాస పూజ, పూజ్య స్వామీజీ పాదుకా పూజ, పవమాన హోమం, దత్త హోమాలను నెరవేర్చారు. అవధూత దత్తపీఠం జూనియర్ స్వామీజీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ అన్ని పూజలను వందలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం గండూరి దత్తాత్రేయ శర్మకు గణపతి సచ్చిదానంద ప్రశస్తిని అందించి సత్కరించారు. వ్రతం సందర్భంగా సెప్టెంబర్ 20 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.


