యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో మాణిక్య ధార జలపాతం వీక్షణకు వచ్చిన కేరళ బాలిక శ్రీనంద (15) అంత్యక్రియలు శుక్రవారం సొంతూరు పాలక్కాడ్ సమీపంలోని కాడంబపుర గ్రామంలో జరిగాయి. నాలుగు రోజుల కిందట మాణిక్యధార ప్రాంతంలో ఆమె అదృశ్యం కావడం, లోయలో శవం దొరకడం తెలిసిందే. అనుకోకుండా జారి పడిందా, కావాలనే దూకిందా అనేదానిపై అనుమానాలున్నాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి ధారలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. 10వ తరగతి చదువుతున్న శ్రీనంద ప్రతిభావంత విద్యార్థిని అని మిత్రులు తెలిపారు. చదువులు, ఆటల్లో చురుగ్గా పాల్గొనేది. కాగా, పోస్టుమార్టం నివేదిక వస్తే ఘటనపై స్పష్టత వస్తుందని పోలీసులు చెప్పారు.
ఏఈఈ ఇంట్లో 6 కేజీల బంగారం
● రూ.14 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
దొడ్డబళ్లాపురం: బెళగావి నగర అభివృద్ధి విభాగంలో ఏఈఈ గా పని చేస్తున్న అజయ్సింగ్ ఇల్లు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు దాడులు జరిపి రూ.14 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. అతని మీద అవినీతి కేసులు నమోదు కావడంతో 9న బెళగావిలోని ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. బ్యాంక్ ఖాతాలు, లాకర్ల గుట్టు లాగారు. భారీ మొత్తంలో డబ్బు, బంగారు నగలతో పాటు ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి. వివరాలను బెళగావి లోకాయుక్త ఎస్పీ శనివారం వెల్లడించారు. అతని వద్ద 6 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.3.12 కోట్ల నగదు, బెళగావిలో 3 ఇళ్లు, సవదత్తి, హుక్కేరి, హుబ్బళ్లిలో 5 సంపన్న ప్రాంతాల్లో స్థలాలు ఉన్నట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న బైక్లు, కార్లు కలిపి మొత్తం రూ.14కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. ఇవి అజయ్సింగ్ ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు అని పేర్కొన్నారు.


