తుమకూరు: ప్రస్తుత ఆధునిక మాధ్యమాల జోరులో రంగభూమి నాటకాల ప్రదర్శన కనుమరుగవుతోందని, అక్కడక్కడన్నా నాటకాలు సజీవంగా ఉన్నాయంటే గ్రామీణ కళాకారుల వల్లేనని ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అన్నారు. తురువేకెరె తాలూకా దబ్బేఘట్ట హోబళి గోణి తుమకూరులో గద్దెకెంపమ్మ దేవీ , శ్రీ ఆదిశక్తి అరసమ్మదేవీ గ్రామ దేవత పండుగలో కురుక్షేత్ర నాటక ప్రదర్శన జరిగింది. ఆద్యంతం కళాకారులు నటనతో రక్తి కట్టించారు. ఎమ్మెల్యే వీక్షించి మాట్లాడుతూ నేటి యువతకు, చిన్నారులకు మన పురాణాలను పరిచయం చేయాలన్నారు. నాటకాల సారాంశాన్ని యువకులు అర్థం చేసుకుని మంచి సమాజ నిర్మాణానికి సహకరించాలని తెలిపారు.
ఐపీఎల్లో బెట్టింగులు.. ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: ఐపీఎల్లో పెద్దమొత్తంలో బెట్టింగులు ఆడి పోగొట్టుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి జిల్లా కాళగి తాలూకా రుమ్మనగోడ్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామవాసి చంద్రకాంత్ దేశాయి (40) స్థానిక బెణ్ణెతూరా డ్యాంలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం సాగుతున్న ఐపీఎల్ టోర్నీలో ఫలానా టీం గెలుస్తుందని, ఫలానా బౌలర్ వికెట్ తీస్తాడని అప్పులు చేసి మరీ ఆన్లైన్లో పందేలు ఆడాడు. అయితే పందేలన్నీ ఓడిపోయి డబ్బులు పోయాయి. దీంతో అప్పులు తీర్చలేక, విరక్తితో డ్యాంలోకి దూకాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
జేడీఎస్ బృహత్
సమావేశం
శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ)లో ఐదు నగర పాలికెల ఎన్నికలకు జేడీఎస్ సిద్ధమవుతోంది. కొమ్మఘట్టలో కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, జేడీఎస్ యువ విభాగం రాష్ట్రాధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతి వెలిగించటం ద్వారా మాజీ ప్రధాని హెచ్.డీ.దేవేగౌడ సమావేశాన్ని ప్రారంభించారు. నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ బెంగళూరు అభివృద్ధికి మాజీ ప్రధాని హెచ్.డీ.దేవేగౌడ, కుమారస్వామి ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. దేవేగౌడ ప్రసంగిస్తూ దేశంలోనే ప్రప్రథమంగా హెచ్.డీ.కుమారస్వామి గ్రామాలలో బస చేశారు, రైతుల సమస్యలు ఆలకించి, రైతులకు ఆర్థిక సహాయం అందించారని అన్నారు.
కాఫీ తోటలో పసిగుడ్డు
బనశంకరి: కిరాతక తల్లిదండ్రులు ఎవరో గానీ.. అప్పుడే పుట్టిన పసిగుడ్డును కాఫీ తోటలో వదిలివెళ్లారు. ఈ ఘటన కొడగు జిల్లా విరాజపేటే తాలూకా బేత్రి గ్రామంలో జరిగింది. ఆకులు పరిచి వాటి మీద పసికందును పెట్టి వెళ్లిపోయారు. శిశువు ఏడుపును విన్న స్థానికులు బిడ్డను చేరదీసి, శిశు సంక్షేమ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. మడికెరి రూరల్ పోలీసులు తల్లిదండ్రులు ఎవరనేదానిపై విచారణ చేపట్టారు.
చిరుతను చంపిన ముళ్లపంది
మైసూరు: ముళ్లపందిని వేటాడేందుకు వెళ్లిన చిరుత దాని ముళ్లకు చిక్కుకుని మరణించింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. ఆకలితో ఉన్న చిరుత ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా ముళ్ల పంది ఎదురైంది. దానిని భక్షించాలని చిరుత దాడి చేసింది. అయితే ముళ్ల పంది ప్రతిఘటించి పోరాడింది, దాని ముళ్లు చిరుత ఎదలో కుచ్చుకున్నాయి. దీంతో రక్తస్రావమైన చిరుత అక్కడే మరణించింది. అటవీ సిబ్బంది గస్తీ కాస్తుండగా చిరుత కళేబరం, దాని దేహంపైన ముళ్లు కనిపించాయి. పోస్టుమార్టం జరిపి పూడ్చివేశారు.


