బనశంకరి: కర్ణాటక ప్రపంచంలోనే అత్యంత సురక్షిత డిజిటల్ వ్యవస్థ కలిగి ఉందని హోంమంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ తెలిపారు. శనివారం నగరంలోని ప్రైవేటు హోటల్లో సీఐడీ, సైబర్ నేరాల శిక్షణా శిబిరం, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసిన 3వ సైబర్ నేరాల తనిఖీ టెక్సమ్మిట్ను హోంమంత్రి ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటక కేవలం ఒక రాష్ట్రమే కాకుండా ప్రపంచ బ్రాండ్ అన్నారు. ప్రపంచమే బెంగళూరు వైపు చూస్తోందని, అత్యంత సురక్షిత డిజిటల్ వ్యవస్థను కలిగి ఉన్నామన్నారు. సైబర్ నేరాలు దర్యాప్తు చేయడానికి డిజిటల్ ఆధారాలు సేకరించడం అత్యంత కీలకం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక సైబర్ నేరాల కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా కర్ణాటక ప్రభుత్వం సైబర్ నేరాలను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందన్నారు. కర్ణాటకలోని అన్ని జిల్లాలు, ప్రముఖ నగరాల్లో మొత్తం 43 సీఈఎన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు సైబర్ సురక్షత కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏఐ, సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రమాద నివారణ లాంటి వివిధ రంగాల్లో పరిణితి కలిగిన వైవిధ్యమైన కంపెనీలతో సైబర్ భద్రత వ్యవస్థకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుందన్నారు. ప్రజలకు డిజిటల్ సురక్షత అందించడానికి ప్రైవేటు రంగం, అంతర్జాతీయ సంస్థలతో నిరంతరంగా చేతులు కలిపి చర్యలు చేపట్టిందన్నారు. సైబర్నేరాల దర్యాప్తుపై శిక్షణ, పరిశోధన కేంద్రం రాష్ట్ర పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ రాష్ట్ర, కేంద్ర సంస్థల సభ్యులతో కలిపి 62 వేల మందికి పైగా శిక్షణ అందించిందన్నారు. సైబర్నేరాలు ఎలాంటి భౌగోళిక ప్రదేశానికి పరిమితం కాలేదన్నారు.
హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్


