కారిడార్లు, సొరంగ మార్గాల నిర్మాణం
బెంగళూరు బస్టాండులో బడ్జెట్ ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రజలు
రాజధాని నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా కొత్త కారిడార్లు
బనశంకరి: బెంగళూరు నగరాభివృద్ధికి బడ్జెట్లో పలు పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. రోడ్లు, మెట్రో రైలు, ఫుట్పాత్ మార్గాల అభివృద్ధి, పాలనా వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నామని సీఎం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. నగర అభివృద్ధి పనులకు రూ.7,000 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
రోడ్లు, చెరువుల అభివృద్ధి
● బెంగళూరు సమగ్రాభివృద్ధికి 2041 రివైజ్డ్ మాస్టర్ప్లాన్(ఆర్ఎంపీ) అమలు. దీంతో నగర రూపురేఖలను మెరుగుపరుస్తామని సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
● బెంగళూరులో 450 కిలోమీటర్ల పొడవైన ప్రముఖ రోడ్ల అభివృద్ధికి రూ.3,000 కోట్లు కేటాయింపు. 175 జంక్షన్ల అభివృద్ధి, 500 కిలోమీటర్ల ఫుట్పాత్ మార్గాల నిర్మాణం, 100 స్కైవాక్లు నిర్మాణం చేస్తామని వెల్లడి.
● రూ.2 వేల కోట్లతో చెరువుల అభివృద్ధి పనులు.
రూ.8 వేల కోట్ల లాభాల్లో మెట్రో
బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు లాభాల్లో ఉందని సీఎం తెలిపారు. సిటీలో 97 కిలోమీటర్ల మేర ఈ రైలు సేవలున్నాయి. గత ఆర్థిక సంవత్సవరంలో రూ.67,460 కోట్లు సమకూరగా, రూ.59,376 కోట్లు ఖర్చయింది, రూ.8,084 కోట్ల లాభం గడించిందని సంస్థ నివేదికలో పేర్కొందని చెప్పారు.
బడ్జెట్లో రూ.7 వేల కోట్ల కేటాయింపు
రోడ్లు, వంతెనలు, చెరువుల అభివృద్ధి
హెబ్బాళ జంక్షన్ నుంచి హెచ్ఎస్ఆర్.లేఔట్ వరకు ఉత్తర– దక్షిణ కారిడార్ పథకం. దీనిని రూ.17,789 కోట్లతో చేపడతారు.
కేఆర్.పురం నుంచి మైసూరు రోడ్డు వరకు మొబైల్ కారిడార్ ప్రాజెక్టు, మొత్తం 40 కిలోమీటర్లు పొడవు సొరంగమార్గాన్ని రూ.40 వేల కోట్ల వ్యయంతో చేపడతారు.
హెబ్బాళ జంక్షన్ నుంచి మేక్రి సర్కిల్ వరకు సొరంగమార్గం, ఫ్లై ఓవర్ (రోడ్డు)ను రూ.2,250 కోట్ల వ్యయంతో బీడీఏ ఆధ్వర్యంలో నిర్మాణం.
నెలమంగల, తావరకెరె, బిడది మార్గంలో 41 కిలోమీటర్ల హైవే నిర్మాణాన్ని పూర్తి చేయాలని తీర్మానం. దీంతో ప్రయాణానికి అనుకూలం కానుంది
బెంగళూరు జనాభా 1.40 కోట్లు కాగా, నీటి సరఫరాకు జేఐసీఏ సహాయంతో రూ.6,939 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు
బెంగళూరు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్తగా 73 కిలోమీటర్లు పొడవైన రోడ్ల పథకాల పూర్తికి చర్యలు
రాష్ట్రంలో మునిసిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి అమృత నగరోత్థాన (మున్సిపాలిటి) పథకం ద్వారా నిర్వహిస్తామని, ఇందుకు రూ.3,885 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.


