
ఆర్డీఎస్ పరవళ్లు
రాయచూరు రూరల్: బళ్లారి, రాయచూరు జిల్లాల్లో పైభాగంలో భారీగా కురిసిన వర్షాలకు జిల్లాలోని మాన్వి తాలూకాలో రాజోలిబండ వద్ద తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) జలాశయం నీటితో నిండి పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర నదికి అడ్డంగా రాజోలిబండ వద్ద 31 అడుగులు ఎత్తున నిర్మించిన డ్యాంకు జలకళ వచ్చింది. జలాశయం నీటి సామర్థ్యం 473.120 మీటర్లు కాగా నిండటంతో ఇన్ఫ్లోగా ఉన్న 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నట్లు ఆర్డీఎస్ ఇంజినీర్ మహ్మద్ తెలిపారు. ఆయకట్టులో రైతులు నారుమళ్లు వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆర్డీఎస్ నుంచి తురకనడోణ, గిల్లేసూగూరు, గాణదాళ, గద్వాల, శాంతినగర్, ఆలంపూర్, మంత్రాలయం, గాజువాక, రచ్చుమర్రి గ్రామాలకు సాగు, తాగు నీటిని అందించే అవకాశం ఉంది.
ఊరిస్తున్న రాయితీ సదవకాశం
● ఒకే వ్యక్తి రూ.9 వేల జరిమానా చెల్లింపు
● 36 ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల నుంచి ఉపశమనం పొందిన వైనం
హుబ్లీ: ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు సంబంధించి చెల్లించాల్సిన జరిమానాపై 50 శాతం రాయితీ అవకాశం కల్పించడంతో ధార్వాడ తాలూకా నరేంద్ర గ్రామ నివాసి కరియప్ప కాళి తనపై ఉన్న 36 కేసులకు సంబంధించి రూ.9 వేల జరిమానా చెల్లించి ట్రాఫిక్ కేసుల నుంచి ఉపశమనం పొందారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడపడం తదితర నియమాల ఉల్లంఘనలపై ఈ–చలాన్లో కరియప్పపై 36 కేసులు దాఖలు చేశారు. మొత్తం రూ.18 వేల జరిమానా చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ఆదేశాల మేరకు 50 శాతం జరిమానా సొమ్ము చెల్లించి కేసుల నుంచి విముక్తి పొందినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. నియమాలను ఉల్లంఘించడంపై కెమెరాలో రికార్డు అయింది. నియమాల ఉల్లంఘన కేసుల జరిమానా బకాయి ఉన్న వారికి ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తున్నాం. ఆ మేరకు పలువురు జరిమానా చెల్లించి తమ కేసుల నుంచి ఉపశమనం పొందుతున్నారన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు తగదు
హుబ్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు పెడుతోందని అసెంబ్లీలో విపక్ష ఉపనేత, ఎమ్మెల్యే అరవింద బెల్లద ఆరోపించారు. ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడి పోతున్న ప్రజలకు ఇప్పుడు మరొక తీరని శరాఘాతం తగిలిందని ఆయన ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సిద్దరామయ్య సర్కారు ఎటువంటి ముందు సూచనలు ఇవ్వకుండా ఆస్తుల నమోదు శుల్కాన్ని ఉన్నఫళంగా రెట్టింపు చేసిందన్నారు. జీవితమంతా శ్రమించి అప్పులు చేసి సొంత ఇల్లు నిర్మించుకొనే కల కంటున్న పేదలు, మధ్య తరగతి వర్గాలపై ఇప్పుడేమో 7.6 శాతం రిజిస్ట్రేషన్, ప్రింటింగ్ ఫీజుల భారం మోపిందన్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయం వల్ల సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కన్న వారికి కాంగ్రెస్ నిరాశ కలిగించిందన్నారు. అవినీతిలో మునిగిన ఈ సర్కారు తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేవలం సామాన్యుల రక్తాన్ని పీల్చిపిప్పి చేస్తోందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఈ ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజులను గతంలో మాదిరిగా యథావిధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్కులను అభివృద్ధి చేయండి
● బుడా అధ్యక్షుడికి స్థానికుల వినతి
సాక్షి,బళ్లారి: నగరంలోని ఎంఆర్వీ లేఅవుట్, హరిప్రియ నగర్ లేఅవుట్, వాజపేయి లేఅవుట్ తదితర కాలనీల్లో ఉన్న పార్కులు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయని, ఆయా పార్కులను అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు బుడా అధ్యక్షుడు జేఎస్ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు. మంగళవారం నగరంలోని బుడా కార్యాలయంలో ఆయా కాలనీవాసులు నాగేశ్వరరావు, రవికుమార్ తదితరులు అధ్యక్షుడిని కలిసి పార్కుల దుస్థితి గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న పార్కులను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, బుడా తరపున పార్కులను బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు.
నైరుతి రైల్వేకు రూ.755 కోట్ల ఆదాయం
హుబ్లీ: నైరుతి రైల్వే ప్రస్తుత ఏడాది ఆగస్ట్ నెలలో రూ.755 కోట్ల ఆదాయం గడించింది. 42 లక్షల టన్నుల సరుకులను రవాణా చేయడం ద్వారా రికార్డు స్థాయిలో ప్రగతి సాధించింది. 1.45 కోట్ల మంది ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లలో సంచరించారు. రూ.305 కోట్ల ఆదాయం లభించింది. సరుకు రవాణా చార్జీల కింద రూ.418 కోట్లు, అలాగే కోచింగ్ సేవల ద్వారా రూ.24 కోట్లు, పార్సిల్ ట్రాఫిక్ కింద రూ.13.5 కోట్లు, టిక్కెట్ల పరిశీలన ద్వారా రూ.4.16 కోట్లు, జరిమానా రూపంలో రూ.59 లక్షలు, వాణిజ్య వనరుల ద్వారా రూ.3.18 కోట్లు, అలాగే వివిధ మార్గాల ద్వారా రూ.8.3 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సాధనకు శ్రమించిన అధికారులు, సిబ్బందిని రైల్వే ప్రధాన వ్యవస్థాపకులు ముకుల్ శరణ్ మాథుర్ అభినందించారు.

ఆర్డీఎస్ పరవళ్లు