
కన్నుల పండువగా కృష్ణాష్టమి
ఊరేగింపులో డోలు వాయిద్య కళాకారుల ప్రదర్శన
హొసపేటెలో రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు
శ్రీకృష్ణుడికి పూజ చేస్తున్న ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్ తదితరులు
సాక్షి,బళ్లారి: సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, మహాభారత యుద్ధంలో పాండవుల్లో ఒకరైన అర్జునుడికి రథసారథిగా ఉండి పాండవుల(ధర్మం) వైపు నిలబడి వారి విజయానికి సహకరించిన మహానుభావుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కన్నుల పండువగా ఆచరించారు. ముఖ్యంగా నగరంలో జిల్లా యంత్రాంగం, గొల్లర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు చేసిన తర్వాత నగరంలోని అండర్ బ్రిడ్జి, రాయల్ సర్కిల్ గుండా బీడీఏఏ మైదానం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం బీడీఏఏ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి మాట్లాడుతూ గొల్ల యాదవ సమాజ ప్రజల కోరిక మేరకు సముదాయ భవన నిర్మాణానికి రూ. 25 లక్షల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధంలో పాండవులకు సహకారం అందించి ధర్మాన్ని కాపాడిన శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడని అన్నారు. మానవ రూపంలో పుట్టిన దేవుడు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీత మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందంటే అది శ్రీకృష్ణ భగవానుడు అందించిన పరమ పవిత్రమైన గ్రంథం అని గుర్తు చేశారు. గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, మేయర్ నందీష్, గొల్లర సంఘం అధ్యక్షుడు, కార్పొరేటర్ గాదెప్ప తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
హొసపేటె: నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. టీబీ డ్యాం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో శనివారం తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రీకృష్ణుడి వేషధారణలు చేసి మురిసిపోయారు. కృష్ణజన్మాష్టమి నాడు పిల్లలను అలంకరించడం వల్ల పిల్లల్లో మతం, సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లోని తమ పిల్లలకు శ్రీకృష్ణ, రాధ వేషధారణ చేసి చూడాలనుకునే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కృష్ణజన్మాష్టమి ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడానికి శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు.
సరళంగా శ్రీకృష్ణాష్టమి
రాయచూరు రూరల్: నగరంలో శ్రీకృష్ణుని జన్మాష్టమిని సరళంగా ఆచరించారు. ఉప్పారవాడి లక్ష్మీవేంకటేశ్వరాలయంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి కార్యక్రమంలో ప్రత్యేక పూజలు జరిపి బాలలతో శ్రీకృష్ణుని పాత్రలు వేయించారు. విఠల్ రుక్మిణి మందిరంలో విశేష కార్యక్రమాలను నెరవేర్చారు. ఇస్కాన్ మందిరంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. శ్రీకృష్ణుడికి ఊయల సేవలు జరిపారు.
వేడుకగా నల్లనయ్య జయంతి
హుబ్లీ: జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా గోకుల అష్టమి శుభవేళ అన్ని చోట్ల బాలకృష్ణుని జయంతి వేడుకలను ఆయా ఆలయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకొన్నారు. ముఖ్యంగా రాయాపుర ఇస్కాన్, కేశవపుర గీతా మందిరతో పాటు ధార్వాడలోని కృష్ణ మందిరాల్లో, అలాగే జిల్లాలోని వివిధ చోట్ల నల్లనయ్య జయంతి వేడుకల సందర్భంగా తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. ముఖ్యంగా ఇస్కాన్లో శుక్రవారం నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. విశేషంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మంటపాలు నిర్మించి కృష్ణయ్య దర్శనం చేయించారు. కేశవపుర గీతా మందిరంలో శనివారం ఉదయం పరమాత్ముడికి వెన్న అలంకారంతో పూజలు నిర్వహించారు. నగరంలోని వివిధ మహిళా మండళ్ల సభ్యులతో భజనలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 7 గంటలకు రామచంద్రాచార్య దాసవాణి కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, ఊయల పూజలు, మహామంగళ హారతి తదితర వేడుకలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. ఇక విద్యా సంస్థల్లో అయితే చిన్నారుల చిట్టిపొట్టి వేషాలతో బాలకృష్ణులను తనివితీరా చూడాల్సిందే. ఫ్యాన్సీ డ్రస్సులతో ముద్దు మురిపాలతో తమ పిల్లలను బాలకృష్ణుడి వేషభూషణాలతో తీర్చిదిద్ది ప్రతి విద్యా సంస్థల్లోను ఈ బాలల కృష్ణవేషధారణ సందడి విశేషంగా కనిపించింది. ఇంకా అదివారం రోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలను వివిధ ఆలయాల్లో ఏర్పాటు చేశారు. ఆరోజు కృష్ణుడి విగ్రహానికి విశేష పంచామృతాభిషేకం, భజనలు, పారాయణం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజవీధిలో వైభవంగా రథోత్సవాన్ని ఏర్పాటు చేశామని కేశవపుర గీతా మందిరం ధర్మ కన్వీనర్ వెంకటేష్ ఆచార్, జాగీర్దార్, ఆ మందిరం మేనేజింగ్ ట్రస్టీ కేశవ్ దేశాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
నగరంలో శ్రీకృష్ణుని విగ్రహం ఊరేగింపు
యాదవ సముదాయ భవనం నిర్మిస్తాం
నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వెల్లడి

కన్నుల పండువగా కృష్ణాష్టమి

కన్నుల పండువగా కృష్ణాష్టమి

కన్నుల పండువగా కృష్ణాష్టమి

కన్నుల పండువగా కృష్ణాష్టమి

కన్నుల పండువగా కృష్ణాష్టమి

కన్నుల పండువగా కృష్ణాష్టమి

కన్నుల పండువగా కృష్ణాష్టమి

కన్నుల పండువగా కృష్ణాష్టమి