
రూ.50 కోట్ల భూమి స్వాధీనం
మైసూరు: చాముండి బెట్టలోని చాముండేశ్వరి, ఆమె సోదరి ఉత్తనహళ్లి జ్వాలాముఖి త్రిపుర సుందరి దేవి ఆలయాలకు చెందిన ఆస్తులను సర్వే చేసిన అధికారులు కబ్జాలు జరిగినట్లు గుర్తించి ఆ స్థలంలోని ఆక్రమణలను తొలగించారు. చుట్టూ కంచె వేయించి రూ.50 కోట్ల విలువ చేసే స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకుని రక్షించారు. ఆరు నెలలుగా ఆస్తుల దాఖలాలను పరిశీలించి, కబ్జాలను కనుగొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల పాలైన భూమిని స్వాధీనపరచుకుని చుట్టూ కంచె వేసి ఆలయ భూమిగా నామఫలకం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కబ్జాలను తొలగించే పనిలో ఉండగా అక్రమార్కుల్లో గుబులు ఏర్పడింది.
ఉపకార వేతనాల
స్కాంలో ఈడీ దాడి
యశవంతపుర: కలబురగి ఎంఆర్ఎంసీ మెడికల్ కాలేజీలో స్కాలర్షిప్ని ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో కాంగ్రెస్ నాయకుడు హెచ్కెఈ సొసైటీ మాజీ అధ్యక్షుడు భీమాశంకర్ బిలగుండి ఇంటిపై ఈడీ అధికారులు బుధవారం దాడి చేశారు. ఎంఆర్ఎంసీ మెడికల్ కాలేజీలో స్కాలర్షిప్ల వ్యవహారంలో అనేక పత్రాలను సీజ్ చేశారు. 2018 నుంచి 2024 వరకు ఈ కాలేజీకి చెందిన హెచ్కెఈ సొసైటీకి ఆయన అధ్యక్షునిగా ఉన్నాడు. 7 వందల మంది ఎంబీబీఎస్ విద్యార్థుల ఉపకార వేతనాల డబ్బులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి. దీని విలువ రూ.80 కోట్లకుపైగా ఉంటుందని ఈడీ అధికారులు అంచనా వేశారు. ఇంటిలో నుంచి అనేక ఫైళ్లను సీజ్ చేసి తీసుకెళ్లారు.
బీజేపీ ఎమ్మెల్యేల
సస్పెన్షన్పై గవర్నర్ లేఖ
శివాజీనగర: ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో గొడవ చేసినందుకు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ యూటీ ఖాదర్ 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ని రద్దు చేయాలని బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్పీకర్కు, ఇటీవల గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్యకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్పందించారు. సస్పెన్షన్ను ఎత్తివేయాలని గవర్నర్.. సీఎం సిద్దరామయ్య, స్పీకర్ ఖాదర్కు లేఖ రాశారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలనే బీజేపీ వినతికి సానుకూలంగా స్పందిస్తున్నా, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని లేఖలో తెలిపారు. తీసుకొన్న చర్యలను తనకు తెలియజేయాలని కూడా గవర్నర్ సూచించారు.
వైకుంఠవాసికి అక్షయ
తృతీయ పూజలు
బొమ్మనహళ్లి: అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం బొమ్మనహళ్ళిలోని వివిధ దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్ అగరలో శ్రీనివాసుని ఆలయంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారుజామునే పంచామృతాలతో అభిషేకం జరిపి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వివిధ పూలహారాలతో అలంకరించారు. పెద్దసంఖ్యలో తరలి వచ్చి భక్తులు స్వామివారిని దర్సించుకున్నారు.
ప్రోటాన్ మెయిల్స్ను నిలిపివేయండి
బనశంకరి: భారతదేశంలో ప్రోటాన్ మెయిల్స్ సేవలను పూర్తిగా నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సంస్థపై మరో సంస్థ దాఖలు చేసిన కేసును బుధవారం న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న విచారణ జరిపారు. తగిన భద్రతా చర్యలు తీసుకునేవరకు ఈ వెబ్సైట్, ఇతర సేవలు నిలిపి వేయాలని ఆదేశించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రోటాన్ మెయిల్స్ సర్వర్లు భారతదేశం బయట నుంచి పనిచేస్తున్నాయి, ఇది భారతీయ చట్టాలకు విరుద్ధం. దుండగులు ప్రోటాన్ మెయిల్స్ ద్వారానే పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ను పంపిస్తున్నారు. అశ్లీల మెసేజ్లను పంపుతున్నారు. ప్రోటాన్ మెయిల్స్ వినియోగం భద్రతకు ప్రమాదమని గుర్తించి రష్యా, సౌదీ అరేబియా దేశాల్లో ఈ సేవలను పూర్తిగా నిషేధించారు అని పేర్కొన్నారు.

రూ.50 కోట్ల భూమి స్వాధీనం

రూ.50 కోట్ల భూమి స్వాధీనం