
హుబ్లీలో మత్తు ముప్పు.. పోలీసుల పైఎత్తు
హుబ్లీ: మత్తు పదార్థాలు లేని జంట నగరాలుగా హుబ్లీ ధార్వాడలను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో గత 9 నెలలుగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా జంట నగరాల్లో డ్రగ్స్ పెడ్లర్ల సంఖ్య తగ్గింది. అయితే నిరంతరం కార్యాచరణ చేపట్టి తగిన జాగృతి కల్పించినా ఇప్పటి వరకు జంట నగరాలను మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దడానికి సాధ్యం కావడం లేదు. జంట నగరాల్లో 2025లో నిర్వహించిన ప్రత్యేక కార్యాచరణలో క్రియాశీలకంగా ఉన్న 45 మంది డ్రగ్స్ పెడ్లర్ల గుట్టు రట్టు చేసి వారికి వ్యతిరేకంగా కఠినమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. గతంలో 2023లో 100 మందికి పైగా పెడ్లర్లు, 2024లో 150 మందికి పైగా పెడ్లర్లు క్రియాశీలకంగా ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పెడ్లర్ల సంఖ్య తగ్గుముఖం పట్టిన జంట నగరాల్లో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు యఽథేచ్చగా వాడకం జరిగిపోతుందని జంట నగరాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ ముఠా అంతు చూడటానికి సంకల్పం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హత్యాచారం తర్వాత పెరిగిన డిమాండ్
ఇటీవల హుబ్లీలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు తర్వాత ఇలాంటి డిమాండ్ స్థానికుల నుంచి గట్టిగా వినబడుతోంది. అదే విధంగా డ్రగ్స్ ముఠాను కూకటి వేళ్లతో పెకలించక పోతే జంట నగరాల్లో నేరాల కృత్యాలు జరుగుతూనే ఉంటాయి. దీంతో డ్రగ్స్ విక్రయదారుల పీచం అణచాలని ప్రజాప్రతినిధులు కూడా చిన్నారి హత్యాచారం తర్వాత డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి చర్చిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా జంట నగరాల పోలీస్ కమిషనర్గా శశికుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్కు విరుద్దంగా ప్రత్యేక కార్యాచరణతో పాటు సినీనటులు ఉపేంద్ర, శివరాజ్ కుమార్ సారథ్యంలో జాగృతి అభియాన్ చేపట్టారు. స్వయాన పోలీస్ కమిషనర్ నేతృత్వంలో 9 నెలల గడువులో నిర్వహించిన 5 ప్రత్యేక కార్యాచరణల్లో 1000 మందికి పైగా వినియోగదారులను గుర్తించారు. అంతేగాక వారికి వ్యతిరేకంగా 200లకు పైగా కేసులు దాఖలు చేసి తగిన చర్యలు తీసుకున్నారు.
505 మంది కస్టమర్లకు వైద్య పరీక్షలు
తొలి కార్యాచరణలో 65 శాతం వినియోగదారుల ఆచూకీని గుర్తించారు. అనంతరం జరిగిన డ్రగ్స్లో 20 నుంచి 25 శాతం వినియోగదారులను గుర్తించారు. అదే విధంగా నిర్ధిష్టంగా పెడ్లర్ల నుంచి సేకరించిన సమాచారం మేరకు 505 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వీరిలో 197 మంది డ్రగ్స్ వాడుతున్నట్లుగా తేలింది. వీరికి వ్యతిరేకంగా 46 కేసులు దాఖలు చేసి చర్యలు కూడా చేపట్టారు. ఇలా వివిధ రకాలుగా కఠిన చర్యలు చేపట్టిన నేపథ్యంలోను వినియోగదారుల సంఖ్య యథావిధంగా కొనసాగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇది పోలీస్ వర్గాల్లో తీరని అసంతృప్తికి, తలనొప్పికి దారి తీస్తోంది. ఉక్కుపాదంతో డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతలపై డేగకళ్ల పహరాతో పోలీస్ శాఖ సదా అప్రమత్తతతో మెలుగుతోంది. అయితే డ్రగ్స్ ముఠాను వెంటాడి కూకటివేళ్లతో పెకలించడానికి సాధ్యం కావడం లేదు. దీంతో సులభంగానే గంజాయి ఎండీఎంఏ తదితర రకరకాల మత్తు పదార్థాల రవాణా సాగుతోంది.
9 నెలల పాటు ప్రత్యేక కార్యాచరణ
తగ్గుముఖం పట్టిన పెడ్లర్ల సంఖ్య
అయినా నిర్మూలన కాని డ్రగ్స్ ముఠా
మరింత పటిష్ట కార్యాచరణకు పిలుపు
దీంతో దీన్ని అరికట్టే దిశలో పోలీస్ శాఖ మరింత పటిష్ట కార్యాచరణ పథకానికి సన్నద్ధం కావాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. నగర డీసీపీ మహాలింగ నందగావి స్పందిస్తూ ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా డ్రగ్స్ విక్రేత సంఖ్య తగ్గుముఖం పట్టినందున వాడకందారుల సంఖ్య కూడా తగ్గింది. డ్రగ్స్ పెడ్లర్ల ముఠా ఆచూకీకి వివిధ కోణాలలో పని చేస్తున్నాం. ఆ విధంగా డ్రగ్స్ లేని జంట నగరాలుగా హుబ్లీ ధార్వాడలను తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ అవిరళ కృషి చేస్తోందన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా జరిగిన 5 ప్రత్యేక కార్యాచరణల్లో 20 నుంచి 35 ఏళ్ల యువకులే డ్రగ్స్ వాడుతుండటం ఎక్కువగా కనిపిస్తోంది. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కుటుంబ సమక్షంలో మానసిక వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ నిర్వహించి మత్తు పదార్థాల వాడకం నుంచి విముక్తి కల్పించే ప్రయత్నాలు జంట నగరాల కమిషనరేట్ నిరంతరంగా చేపడుతోంది. వీరిలో పలువురు వాడకం దారులు వాటి నుంచి విముక్తులు అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది కాస్తంత ఊరటను ఇచ్చే విషయమే.