స్కూటర్‌పై రూ.3.20 లక్షల చలానాలు | - | Sakshi
Sakshi News home page

స్కూటర్‌పై రూ.3.20 లక్షల చలానాలు

Feb 12 2024 1:16 AM | Updated on Feb 12 2024 8:55 AM

- - Sakshi

ఈ స్కూటర్‌పైనే వందలాది చలానాలు

ఒక స్కూటర్‌పై వందలాది ట్రాఫిక్‌ చలానాలు ఉన్నాయి, మొత్తం జరిమానాలను లెక్కిస్తే రూ. 3.20 లక్షలుగా తేలింది.

కర్ణాటక: ఒక స్కూటర్‌పై వందలాది ట్రాఫిక్‌ చలానాలు ఉన్నాయి, మొత్తం జరిమానాలను లెక్కిస్తే రూ. 3.20 లక్షలుగా తేలింది. హెల్మెట్‌ లేకుండా, సిగ్నల్‌ జంప్‌, వన్‌వేలో, మొబైల్‌లో మాట్లాడుతూ తదితర ధిక్కారాలకు పాల్పడడం వల్ల ఈ చలానాలు పడ్డాయి. వివరాలు.. సుధామనగరవాసి వెంకటరామన్‌కు చెందిన కేఏ 05 కేఎఫ్‌ 7969 నంబరు కలిగిన యాక్టివా స్కూటర్‌ ఈ ఘనతను సాధించింది. దీనిపై 300 కు పైగా చలానాలు ఉండగా, వాటిని కట్టాలంటే రూ.3.20 లక్షలు కావాలి.

స్కూటర్‌ వద్దు, డబ్బు కట్టు
వెంకటరామన్‌ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా ఎస్‌ఆర్‌నగర, విల్సన్‌గార్డెన్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరిగేవాడు. ట్రాఫిక్‌ పోలీసులు అతని ఇంటికి వెళ్లి జరిమానాలను చెల్లించాలని సూచించారు. దీనికి వెంకటరామన్‌ ఇంత మొత్తంలో డబ్బు కట్టలేనని, స్కూటర్‌ను తీసుకెళ్లవచ్చని చెప్పాడు. మాకు స్కూటర్‌ వద్దు, డబ్బు కట్టు, లేదంటే కేసు పెడతామని పోలీసులు హెచ్చరించి నోటీస్‌ ఇచ్చారు.

గతేడాది రూ.3.22 లక్షలు
గతంలో ఆర్‌టీ.నగరలోని గంగానగరలో ఒక స్కూటీ పెప్‌పై 2023 డిసెంబరులో రూ.3.22 లక్షల జరిమానాలు ఉన్నట్లు తేలింది. మాలా అనే మహిళకు చెందిన స్కూటీ పై 643 చలానాలు ఉన్నాయి. రూ.50 వేల కంటే అధిక జరిమానా ఉంటే ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారుల ఇళ్లకు వెళ్లి జరిమానా వసూలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement