నేను బీజేపీకి అన్యాయం చేయలేదు | - | Sakshi
Sakshi News home page

నేను బీజేపీకి అన్యాయం చేయలేదు

Apr 27 2023 6:26 AM | Updated on Apr 27 2023 6:46 AM

- - Sakshi

హుబ్లీ: తాను బీజేపీకి ఎలాంటి అన్యాయం చేయలేదని, అయినా జగదీష్‌ శెట్టర్‌ అనే పేదవాడిపై ఎందుకు విరుచుకు పడుతున్నారో తెలియదని హుబ్లీ–ధార్వాడ సెంట్రల్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీష్‌ శెట్టర్‌ తెలిపారు. నగరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఓటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోందన్నారు. అయితే మే 10న జనతా కోర్టులో గెలుపోటములు నిర్ణయం అవుతాయన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హుబ్లీలో జగదీష్‌ శెట్టర్‌ను ఓడించాలని ప్రకటించారన్నారు. అంతేగాక యడియూరప్ప కూడా మంగళవారం ప్రముఖుల సమావేశంలో తనపైన, తన ఓటమిపైనా దృష్టి సారించారన్నారు. పేదోడిపై వీరికి ఎందుకు అంత కోపమన్నారు. తానొక్కడినే బీజేపీని వీడలేదని, తనలానే ఆయనూరు మంజునాథ, లక్ష్మణ సవధి, యల్లాపురలో మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఆర్‌.సంతోష్‌ తదితరులు బీజేపీ నుంచి వైదొలిగి కాంగ్రెస్‌లో చేరారన్నారు.

అయితే తనను మాత్రమే పెద్ద తప్పు చేసిన వాడిలా నిలదీస్తున్నారన్నారు. గతంలో ఆపరేషన్‌ కమల చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే తత్వ సిద్ధాంతాలన్నీ మట్టిలో కొట్టుకు పోయాయన్నారు. వారికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement