జమ్మికుంట: ఫిర్యాదు అందగానే ఘటనపై విచా రించాల్సిన పోలీసులు ఖాకీ చొక్క ఒంటిపై ఉందని తమ జులం చూపారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై నలు గురు పోలీసులు కలిసి చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన జమ్మికుంటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. వీణవంక మండలం హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన రాజు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌస్కు వెళ్లాడు. ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీశాడు. ఈ క్రమంలో రాజుతో స్వీట్హౌస్ యాజమాని దురుసు ప్రవర్తించాడు. ఆగ్రహానికి గురైన రాజు షట్టర్ కిందికి వేసేందుకు యత్నించాడు. షాపు యజమాని 112కు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న నలుగురు పోలీసులు రాజుపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లారు. కాసేపటికి వదలిపెట్టగా రాజు గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగాడు. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ రామకృష్ణ బాధితుడితో మాట్లాడి, సముదాయించాడు. ఈ విషయమై సీఐని ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘రాజు మద్యం మత్తులో ఉండి రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. పోలీసులు అతడిని ఈడ్చుకెళ్లినట్లు నిర్ధారణ అయితే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.


