ధర్మపురి: కూతురు చనిపోయిన దుఃఖాన్ని దిగమించుకుని ఆమె కళ్లను దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది తల్లి. ఈ సంఘటన మండలంలోని కమలాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆవునూరి లక్ష్మణ్, గంగమ్మ దంపతుల కూతురు లావణ్య (21) మూడురోజుల క్రితం తన బంధువుల ఇంటికి అన్న, వదినలతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తిమ్మాపూర్, మద్దునూర్ మధ్య డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న లావణ్య, ఆమె అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. లావణ్యను చికిత్స నిమిత్తం 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం చనిపోయింది. తన కూతురు కళ్లు సజీవంగా ఉండాలని, మరో ఇద్దరికి చూపునివ్వాలని పెద్ద మనసుతో తల్లి గంగా సోదరులు ఆవునూరి మహేష్, శ్రీనివాస్, ప్రదీప్ హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. వైధ్యులు శ్రీనివాస్కు లావణ్య కళ్లను అందించారు. కార్యక్రమంలో నాయకులు చెన్నోజి రాజేంద్రప్రసాద్, మల్లేష్, నరేష్ తదితరులున్నారు.
ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
● ఆరుగురు లెక్చరర్లకు నోటీస్లు
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లలో కొంతమందికి ఇంటర్మీడియట్బోర్డు అధికారులు నోటీసులు జారీచేశారు. 2023లో ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కొంతమంది లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఇంటర్బోర్డు అధికారులు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కాకుండా ఇతర రాష్ట్రాలలో పీజీ చదివి లెక్చరర్లుగా నియామకమైన వారి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు వెళ్లి సర్టిఫికెట్లపై ఆరా తీశారు. ఈనేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలో పలు కళాశాలల్లో పనిచేస్తున్న ఆరుగురు లెక్చరర్లకు ఇంటర్బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలకు ప్రభుత్వం నడుం బిగించింది. కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, ఇల్లంతకుంట కళాశాలల్లో పనిచేస్తున్న వారికి నోటీసులు జారీ కావడం చర్చకు దారితీసింది.
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
కరీంనగర్ క్రైం: కరీంనగర్ రాజీవ్చౌక్లోని అస్లాం మసీదు ఎదురుగా ఉన్న పల్లవి క్లాత్స్టోర్లో శనివారం వేకువజామున స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారులు తెలిపారు.
చికిత్స పొందుతూ విజ్ఞత మృతి
● ఆస్పత్రిలోనే భర్త వసంత్
యైటింక్లయిన్కాలనీ: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యావనవేని విజ్ఞత(27) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి మహాకవి పోతనకాలనీలోని నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు యాదనవేని వసంత్ – విజ్ఞత దంపతులు ఈనెల 2న గ్యాస్స్టౌవ్ పేలి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. 80శాతం కాలిన గాయలతో విజ్ఞత, 60 శాతం కాలిన గాయాలతో వసంత్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజ్ఞత చనిపోయింది. వసంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దంపతుల ఇద్దరు పిల్లలు బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. దీంతో పోతనకాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నట్లు స్థానికులు తెలిపారు. విజ్ఞత తల్లిగారి గ్రామమైన బెల్లంపల్లిలోని బుచ్చంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


