చొప్పదండి: అత్యుత్తమ విద్యతో పాటు, విభిన్న రంగాల్లో విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి జవహర్ నవోదయ విద్యాలయాలు కృషి చేస్తున్నాయని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే కొనియాడారు. తానూ మహారాష్ట్రలోని సోలాపూర్ నవోదయ విద్యాలయ పూర్వ విద్యార్థినేనని గుర్తు చేశారు. చొప్పదండిలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. హాజరైన అశ్వినీ తానాజీ మాట్లాడుతూ నవోదయలో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ నవీన్ కుమార్, నరోత్తంరెడ్డి, సాంబయ్య, కృష్ణహరి పాల్గొన్నారు.


