విత్తనం నుంచి విపణి వరకు..
‘భారత్ విస్తార్’కు డిజిటల్ తోడు
అన్నదాత అరచేతిలో సమగ్ర సమాచారం
పంట నుంచి మార్కెట్ వరకు స్మార్ట్ సలహాలు
ఫొటో పంపితే తెగుళ్ల నిర్ధారణ.. స్థానిక భాషలో శాసీ్త్రయ సలహాలు
సాక్షి,పెద్దపల్లి: పొలంలో పంటను పీడిస్తున్న తెగులు ఏదో తెలియక ఆందోళన చెందుతున్నారా? ఏ కాలంలో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో లెక్కలు వేసుకుని తలపట్టుకుంటున్నారా? దిగుబడిని ఎక్కడ విక్రయించాలో, ఈరోజు మార్కెట్ డిమాండ్ ఎంతఉందనే సందిగ్ధంలో ఉన్నారా? ఇకపై అన్నదాతలు ఈ సమస్యలన్నింటికీ ఆందోళన చెందాల్సిన పన్లేదు. ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో కూడిన ‘భారత్ విస్తార్’ అనే అత్యాధునిక డిజిటల్ టూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విత్తనం నుంచి విపణి వరకు సమస్త సమాచారాన్ని అరచేతిలో ఉంచుతున్న స్మార్ట్ యాప్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
భారతీయ వ్యవసాయ రంగాన్ని డిజిటలీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను చేపట్టింది. ఇందులో భాగంగానే వివిధ పరిశోధనా సంస్థలు, అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్) ప్యాకేజీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు విడివిడిగా ఉన్న ఈ డేటాను ఏఐతో అనుసంధానించడం ద్వారా రైతులకు నేరుగా, సకాలంలో సరైన సలహాలు అందేలా ‘భారత్ విస్తార్’ను రూపొందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ టూల్ ద్వారా ఏకంగా 95 లక్షలకుపైగా రైతుల ప్రశ్నలకు సముచిత సమాధానాలు అందాయి. దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తున్నా.. అవగాహన లేక చాలామంది రైతులు ప్లాట్ఫాం సేవలు వినియోగించుకోలేకపోతున్నారు.
ఏఐ టూల్ విశేషాలు
సమగ్ర సమాచారం ఒకే చోట: ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్లు, పరిశోధన కేంద్రాల నుంచి వచ్చే సమాచారాన్ని ఒకేగొడుగు కిందకు తీసుకొచ్చి, రైతులకు సులభంగా అర్థమయ్యేలా ఏఐ వ్యవస్థ విశ్లేషించి చెబుతుంది.
ఉచిత డౌన్లోడ్ సౌలభ్యం: గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఎవరైనా ‘భారత్ విస్తార్’ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
స్థానిక భాషల్లో సేవలు: సంక్లిష్టమైన శాసీ్త్రయ సమాచారాన్ని రైతులు మాట్లాడే స్థానిక భాషల్లోకి అనువదించి మరీ ఈ సలహాలిస్తుంది.


