రామడుగు(చొప్పదండి): రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన నెల్లి తిరుపతి (35)కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బందువులు ఆందోళనకు దిగారు. రామడుగు మండలం కోరటపల్లి గ్రామానికి చెందిన నెల్లి తిరుపతి బుధవారం సాయంత్రం గ్రామం నుంచి షానగర్ వైపు బైక్పై వెళ్తున్నాడు. షానగర్ శివారులో కోరటపల్లి సర్పంచ్ భర్త మేకల ప్రభాకర్ యాదవ్ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తిరుపతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శవపంచనామా అనంతరం అంబులెన్స్లో మృదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ ప్రధాన కూడలి వద్ద , మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. సర్పంచ్ భర్త వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రామడుగు, గంగాధర, చొప్పదండి ఎస్సైలు రాజు, వంశీకృష్ణ, నరేష్రెడ్డి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. తిరుపతి కుటుంబ సభ్యులతో మాట్లాడి చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కె.రాజు తెలిపారు.


