కరీంనగర్ టౌన్/కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్ది, కరీంనగర్ జిల్లాను విద్యారంగంలో రాష్ట్రస్థాయి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖపై ఎంఈవోలు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఈవో చైతన్య జైనీ, కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి శ్రీనివాసు ఉమారాణి శ్రీనివాసుపాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయండి
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జిల్లాను ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. తొలి విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్లోపు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, పెద్ద ఎత్తున గహప్రవేశాలు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ అధికారులతో తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, రెండో విడతలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు గడువులోగా పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పీడీ గంగారాం ఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


