ఆగస్టు 10నుంచి సెప్టెంబర్ 8వరకు గ్రామాల సమగ్ర సర్వే
కచ్చితమైన సమాచార సేకరణతో డిస్ట్రిక్ట్ హ్యాండ్బుక్ రూపకల్పన
అధికారుల శిక్షణలో కలెక్టర్ చిత్రామిశ్రా
కరీంనగర్ అర్బన్: పాపులేషన్ సెన్సస్– 2027లో భాగంగా విలేజ్ డైరెక్టరీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆగస్టు 10నుంచి సెప్టెంబర్ 8వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలు, మున్సిపాలిటీలలో విలేజ్ డైరెక్టరీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఆస్పత్రులు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు, పశువైద్య సేవలు తదితర మౌలిక వసతులతో కూడిన తొమ్మిది సెక్షన్ల సమాచారాన్ని నిర్దిష్ట నమూనాలో సేకరించి పాపులేషన్ సెన్సస్ యాప్లో నమోదు చేయాలన్నారు. ఈ సమాచారాన్ని సంబంధిత 16 మండలాల చార్జ్ ఆఫీసర్లు/తహసీల్దార్లు, మూడు మున్సిపాలిటీల కమిషనర్లు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిశీలించి, అవసరమైన సవరణలు చేసి పాపులేషన్ సెన్సస్ డిపార్ట్మెంట్కు పంపిస్తారని అన్నారు. రాష్ట్ర సెన్సస్ అధికారులు ధృవీకరించి, పాపులేషన్ సెన్సస్ డిపార్ట్మెంట్, ఢిల్లీకి ఫార్వర్డ్ చేస్తారు. తుది పరిశీలన అనంతరం ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్బుక్ (డీసీహెచ్బీ) విడుదల చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రాందత్తా రెడ్డి, జిల్లా గణాంక అధికారి, అడిషనల్ డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫీసర్ వెల్ది కిషన్ రావు పాల్గొన్నారు.
రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు వేగవంతం చేయండి
రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. ప్రజావాణి అనంతరం వివిధ అంశాలపై అధికారులతో మాట్లాడారు. సభ్యత్వ నమోదులో ఇప్పటికే రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉందని, ఉద్యోగులు స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రొత్సహించాలన్నారు.
అన్ని హంగులతో సిద్ధం చేయండి
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ చిత్రామిశ్రా పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నూతన హెలిప్యాడ్ను పరిశీ లించారు. భవనంలో నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్, సానిటేషన్ తదితర మౌలిక సదుపాయాల్లో లోపాలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. పాత కలెక్టరేట్ భవనానికి అవసరమైన రినోవేషన్ పనులను వెంటనే ప్రారంభించి, అత్యవసర మరమ్మతులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు.


