కరీంనగర్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నెల 9 నుంచి 14 వరకు పనులు బంద్ చేసి ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు సంఘీభావం ప్రకటించారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ చిత్రామిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు, కార్మిక భవన నిర్మాణానికి స్థలం, నిధుల కేటాయింపు చేయాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు ‘కార్మికబంధు’ పేరిట రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. లేబర్ కార్డు గడువును 70ఏళ్లకు పెంచాలన్నారు.


