Telangana News: 'ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం'..! రెండ్రోజులుగా.. బిక్కు బిక్కుమంటూ..
Sakshi News home page

'ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం'..! రెండ్రోజులుగా.. బిక్కు బిక్కుమంటూ..

Sep 12 2023 12:24 AM | Updated on Sep 16 2023 5:09 PM

- - Sakshi

కరీంనగర్: ‘ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం’ అని చెప్పి ఓ మహిళను వదిలేసి వెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఐబీ రోడ్డులో చోటు చేసుకుంది. సదరు మహిళ రెండు రోజులుగా దిక్కుమొక్కు లేక చలిలో..వానలో వాటర్‌ ట్యాంక్‌ కింద ఉండి తనవాళ్ల కోసం ఎదురుచూస్తోంది. ఆమె దీనస్థితి అందరినీ కలచివేసింది.

వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం కొందరు ఆటోలో వచ్చి ఐబీ రోడ్డు వాటర్‌ ట్యాంక్‌ దగ్గర అనారోగ్యంతో ఉన్న మహిళ(45)ను వదిలేసి వెళ్లారు. అదే ఏరియాలో ఉండే మైనార్టీ యూత్‌ యువకులు అబుబకర్‌, షోయబ్‌ రెండు రోజులుగా వాటర్‌ ట్యాంక్‌ కింద ఉన్న మహిళను గుర్తించి ప్రశ్నించగా తనను రెండు రోజుల క్రితం తమవాళ్లు ఆటోలో తెచ్చి ఇక్కడ వదిలేశారని చెప్పింది. దీంతో ఆమె అనారోగ్య పరిస్థితిని గుర్తించిన యువకులు.. వెంటనే వార్డు కౌన్సిలర్‌ పేర్ల సత్యంకు సమాచారం ఇచ్చారు.

స్పందించిన వార్డు కౌన్సిలర్‌ సత్యం.. సోమవారం రాత్రి అక్కడికి వచ్చి అనారోగ్యంతో పడిఉన్న మహిళ వివరాలు తెలుసుకున్నారు. తన పేరు మిర్యాల లక్ష్మి అని, తనది నిజామాబాద్‌ జిల్లా అని, తమవాళ్లు తనను ఇక్కడ వదిలేసి వెళ్లారని అస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కాగా ఆమె చేయిపై విజయ అని పచ్చబొట్టు ఉందని కౌన్సిలర్‌ పేర్ల సత్యం చెప్పారు.

అనారోగ్యంతో ఉన్నసదరు మహిళను యూత్‌ ప్రతినిధులు అబుబకర్‌, షోయబ్‌తో కలిసి కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ సరైన సమాధానాలు చెప్పకపోగా ఆమె కాలుకు తీవ్రమైన గాయంతో పుండు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు.. ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement