మహిళా సంఘాలు ఆసక్తిగా ఉన్నాయి
● గ్యాస్ ఏజెన్సీలతో ముగిసిన చర్చలు
● గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో ఉజ్వల సఖి కేంద్రాల ఏర్పాటు
ఎల్లారెడ్డి : మహిళా సంఘాల ఆధ్వర్యంలో వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.గ్యాస్ ఏజెన్సీకి దూరంగా ఉన్న గ్రామాల్లో సిలిండర్లు దొరకక ఇబ్బంది పడుతుంటారు. దీంతో మారుమూల గ్రామాల్లో సైతం 24 గంటలూ వంట గ్యాస్ సిలిండర్లు సముచిత ధరలకే చేర్చడానికి ప్రభుత్వం ఉజ్వల సఖి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. పల్లెల్లో ఏర్పాటు చేస్తున్న ఉజ్వల సఖి కేంద్రాల్లో ఎంపిక చేసిన మహిళా సంఘాలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ బాధ్యతను అప్పగిస్తారు. ఆ మహిళా సంఘాల సభ్యులు తమ రోజూవారీ పనులు చేసుకుంటూనే సిలిండర్లను విక్రయించవచ్చు.
అడ్వాన్స్గా గ్యాస్ ఏజెన్సీకి
రూ.10 వేలు చెల్లించాలి
ఒక్కో సఖీ కేంద్రం రూ. 10 వేల వరకు అడ్వాన్స్గా గ్యాస్ ఏజెన్సీకి చెల్లించాలి. సఖి కేంద్రాల ఎంపిక మహిళ సంఘాల ద్వారా జరుగుతుంది. మహిళలకు 6 సిలిండర్లను అందజేస్తారు. ఇందుకు కావాల్సిన పెట్టుబడి మహిళా సంఘాల సభ్యులే అందజేయాల్సి ఉంటుంది. ఈ సిలిండర్లను మహిళా సంఘాల సభ్యులు గ్రామాల్లో అవసరమున్న వారికి మార్కెట్ ధర ప్రకారం విక్రయించాల్సి ఉంటుంది. సిలిండర్లను విక్రయించినందుకు గాను ఒక్కో దానిపై అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. స్టాక్ అయిపోగానే వెంటనే సంబంధిత డీలర్లు మరో 6 సిలిండర్లు సఖీ కేంద్రాలకు ఇస్తారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే సఖి కేంద్రాల ఏర్పాటు చేసి సిలిండర్లను పంపిణీ చేపట్టనున్నారు. తమ గ్రామంలోనే సఖీ కేంద్రాల ఏర్పాటుతో వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తే బాగుంటుందని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఉజ్వల సఖి కేంద్రాల ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం గ్యాస్ ఏజెన్సీలతో, మహిళా సంఘాల సభ్యులతో చర్చలు ముగిశాయి. ఇప్పటి వరకు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ మాత్రమే ముందుకు వచ్చింది. సఖీ కేంద్రాల ఏర్పాటుకు మహిళా సంఘాలు ఆసక్తిగా ఉన్నాయి.
– దామోదర్ రెడ్డి, డీఆర్డీవో, కామారెడ్డి


