సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి రాజంపేట మండలం మీదుగా మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే అంతర్ జిల్లా రహదారిపై పలుచోట్ల ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులు, బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఘాట్ ఉన్న అటవీ ప్రాంతం మొత్తం సింగిల్ రోడ్డే కావడంతో ఇక్కడ వాహనాలు నడపడం కత్తిమీద సాములా ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు కోతకు గురై మరింత ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా రాజంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలోని ఘాట్ సెక్షన్లో ఉన్న మలుపులలో వాహనదారులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని వాహనాలను నడుపుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక్కడ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు చొరవ చూపి రోడ్డు విస్తరణకు అటవీ అనుమతులు సాధించి, అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


