నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం సాయంత్రానికి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.55 అడుగుల (11.949 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల నుంచి 1,358 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు.
పోచారం ప్రాజెక్టుకు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,472 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. 100 క్యూసెక్కుల నీరు పోచారం ప్రధాన కాలువలోకి విడుదలవుతుండగా, 1,372 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా వెళ్తోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
కామారెడ్డి టౌన్: మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ యాడారం ప్రియాంక తండ్రి ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సోమవారం వారి నివాసానికి వెళ్లారు. కౌన్సిలర్ ప్రియాంక, వారి కుటుంబసభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. అధైర్యపడొద్దని, అన్నివేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వెంట నాయకులు సంతోష్, పండ్ల ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
● కేంద్రమంత్రి పీయూష్ గోయల్
నేతృత్వంలోని బృందంలో చోటు
కామారెడ్డి టౌన్ : జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పైడి ఎల్లారెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఈ నెల 24 నుంచి 28 వరకు జపాన్ దేశంలో పర్యటించనున్న ‘ఇండియన్ బిజినెస్ డెలిగేషన్’ బృందంలో ఆయనకు చోటు దక్కింది. ఈ మేరకు భారత పరిశ్రమల సమాఖ్య ఆయనకు అధికారికంగా లేఖను అందించింది. భారత్ – జపాన్ వాణిజ్య బంధం బలోపేతంలో భాగంగా ఇరుదేశాల మధ్య నూతన పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంపై జపాన్ అగ్రగామి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు పైడి ఎల్లారెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.


