● బల్దియా కౌన్సిలర్ వినూత్న నిరసన
● రోడ్డుమీద వర్షపునీరు నిలుస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో..
కామారెడ్డి టౌన్: సమస్య పరిష్కారం కోసం కామారెడ్డి బల్దియా కౌన్సిలర్ వినూత్న నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పోలీస్స్టేషన్ ఎదుట భారీగా నీరు నిలిచి రాకపోకలు స్తంభిస్తున్నాయి. కొద్దిపాటి వానకే మోకాలు లోతు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గతంలో మున్సిపల్ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగివేసారిన 46వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీనారాయణ పోరుబాట పట్టారు. శనివారం ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుట నిలిచిన వర్షపు నీటిలో పద్మాసనం వేసి బైఠాయించారు. కౌన్సిలర్ నిరసనను చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వర్షపు నీరు నిలువకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. లేదంటే బురదలోనే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.


