దరఖాస్తు చేసుకోవాలి
● తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన పిల్లలకు రక్షణ, పునరావాసం
● ప్రభుత్వ పథకంతో భరోసా
ఎల్లారెడ్డిరూరల్: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మిషన్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అనాథ పిల్లల చదువు, పోషణ కోసం ఆర్థికసాయం అందిస్తోంది. వీరికి 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతీ నెలా రూ.4 వేల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు.
ప్రతీ ఏడాది అకౌంట్లోకి రూ.48 వేలు
ప్రతీ నెలా రూ.4 వేల చొప్పున ఇవ్వనుండగా.. వీటిని ఆరు నెలలకు ఒకసారి రూ.24 వేల చొప్పున అకౌంట్లలో జమ చేస్తారు. ఏడాదికి రూ.48 వేలు అందుతాయి. వీటిని పిల్లల పోషణ, చదువులకు ఉపయోగించుకోవచ్చు. సీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం అధికారులను, అంగన్వాడీ కార్యకర్త, పర్యవేక్షకురాలు, సీడీపీవోను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, సంరక్షకుల ఆధార్, రేషన్కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ బుక్తో పాటు అవసరమైన పత్రాలు అందించాల్సి ఉంటుంది.
2019లో ప్రారంభం
భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకం 2019లో ప్రారంభమైంది. అనాథలు, నిరాశ్రయులు, సంరక్షణ అవసరమైన పిల్లలకు రక్షణ, విద్య, పోషణ, పునరావాసం అందించడం దీని లక్ష్యం. కొవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు తల్లిదండ్రులు లేని 169 మంది మిషన్ వాత్సల్య పథకం ద్వారా ప్రతి నెలా రూ. నాలుగు వేల స్కాలర్షిప్ పొందుతున్నారు. వీరికి 18 ఏళ్లు వచ్చే వరకు ఈ స్కాలర్ షిప్ ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేస్తుంది.
తల్లిదండ్రులు లేని అనాథలు మిషన్ వాత్సల్య పథకానికి జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలి. వీరికి ప్రభుత్వం ద్వారా నెలకు రూ. 4వేల స్కాలర్ షిప్ అందిస్తుంది. చిన్నారుల వయస్సు 18 ఏళ్లు వచ్చేంత వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు.
– ప్రసన్న, జిల్లా సంక్షేమ అధికారిణి, కామారెడ్డి


