సైబర్ వారియర్స్కు టెక్నికల్ నాలెడ్జ్...
● డిజిటల్ మోసాలకు గురైన
బాధితులపై ప్రత్యేక శ్రద్ధ
● జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు
ఎల్లారెడ్డిరూరల్: డిజిటల్ మోసాలకు గురైన బాధితులకు సైబర్వారియర్స్ అండగా నిలుస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారికి సైబర్ కంప్లయిట్ టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయించి, తర్వాత పనులన్ని పూర్తి చేయిస్తూ వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
22 పోలీస్స్టేషన్లలో ...
జిల్లాలో కామారెడ్డి రూరల్, బాన్సువాడ రూరల్, ఎల్లారెడ్డి, బిచ్కుంద, భిక్కనూర్, సదాశివనగర్లలో ఆరు పోలీస్ సర్కిల్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 22 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ను సైబర్ వారియర్గా ఎంపిక చేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులపై వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాధితులకు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు.
కేసు పర్యవేక్షణ సీఐల పరిధిలోనే..
సైబర్ బాధితుల కేసులను ఆయా సర్కిల్ పరిధిలోని సీఐలు పర్యవేక్షిస్తారు. సైబర్ వారియర్స్కు వీరు సలహాలు అందించి డబ్బులు రికవరి అయ్యేలా చూస్తారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని బాధితులతో పాటు పోలీసులు తెలిపారు.
సైబర్ వారియర్స్తో మంచి ఫలితాలు వస్తున్నాయి. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్స్ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి పోలీస్ శాఖ ప్రత్యేక శిక్షణను ఇవ్వడంతో పాటు ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పిస్తారు. సైబర్ మోసానికి గురైన వారు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు రాగానే ముందు బాధితులతో 1930 నంబరుకు ఫిర్యాదు చేయించడం జరుగుతుంది. బాధితులు పోగొట్టుకున్న డబ్బులు రికవరీ అయ్యేందుకు వీరు తోడ్పాటును అందిస్తున్నారు. – రాజారెడ్డి, సీఐ, ఎల్లారెడ్డి
పోలీస్ సిబ్బందికి టెక్నికల్ నాలెడ్జి ట్రైనింగ్ ను పోలీస్ ఉన్నతాధికారులు అందిస్తున్నారు. వీరు ప్రతి గ్రామంలో సైబర్ నేరాలపై జరిగే మోసాలను ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి నెలలో 8 కార్యక్రమాలను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. సైబర్ నేరస్తులు మాట్లాడే విధానం వారి ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. బాధితులు సైబర్ మోసానికి గురైన తీరును తెలుసుకుని వారి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయించేందుకు సహకరిస్తారు. దీంతో బాధితులు పొగొట్టుకున్న డబ్బు సైబర్ నేరస్తుల ఖాతాకు వెళ్లకుండా తగిన చర్యలను తీసుకుంటారు.


