క్రమం తప్పకుండా సమావేశాలు..
● పీటీఎంకు తల్లిదండ్రుల
హాజరు తక్కువ శాతమే
● అవగాహన కల్పిస్తున్నా నెరవేరని లక్ష్యం
ఎల్లారెడ్డి: తల్లిదండ్రుల భాగస్వామ్యంతో సర్కారు బడులను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న పీటీఎం (పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) జిల్లాలో మొక్కుబడిగానే సాగుతున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల ప్రగతి ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు తెలియాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ ప్రతి నెలలో మూడో శనివారం పీటీఎం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 2022 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు నిర్వహించడం తప్పనిసరి చేశారు.
పట్టింపు కరువు..
కామారెడ్డి జిల్లాలోని 1,269 పాఠశాలల్లో 1,61,391 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసుకున్నారు. పాఠశాల, గురుకుల తదితర విద్యా సంస్థల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు తల్లిదండ్రులు హాజరై తమ పిల్లలు ఎలా చదువుతున్నారు.. ప్రవర్తన ఎలా ఉంది.. బడిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. టీచర్ల బోధన ఎలా జరుగుతోంది.. నాణ్యమైన భోజనం పెడుతున్నారా? పిల్లల ఉన్నతమైన చదువుకు తల్లిదండ్రులుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై కూలంకషంగా చర్చించాల్సి ఉంటుంది. ప్రతి నెలా మూడో శనివారం పీటీఎంపై ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు వారం ముందే సమాచారం ఇస్తున్నారు. అయితే, సమావేశాలకు తల్లిదండ్రులు కేవలం 30 నుంచి 40 శాతమే హాజరవుతున్నారని, దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రతీ పాఠశాలలో ప్రతినెలా క్రమం తప్పకుండా పీటీఎం నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులకు సమావేశంపై వారం ముందే తెలియజేస్తాం. సరైన అవగాహన లేక తల్లిదండ్రులు మీటింగ్లకు హాజరుకావడం లేదు.
– మల్లికార్జున్, డీఈవో, కామారెడ్డి


