ఆపరేషన్ కవచ్లో ముఖ్యమైనవి
● ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించాం
● ప్రివెంటివ్ పోలీసింగ్ వైపు అడుగులు
● ఎస్పీ రాజేశ్చంద్ర వెల్లడి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా పోలీస్ శాఖ ప్రారంభించిన ‘ఆపరేషన్ కవచ్’తో నేరాలకు కళ్లెం వేయడంతోపాటు నేరస్తులను పట్టుకున్నామని ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. జిల్లాలో ప్రతి రోజూ 22 చెక్పోస్టుల ద్వారా నాకాబందీ నిర్వహించి నేరాలు జరగకుండా నిరోధించామని, ఏడాది కాలంలో ఎన్నో విజయాలు సాధించినట్లు వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. గతేడాది జూలై 25న ప్రారంభమైన ఆపరేషన్ కవచ్ నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించందని, అదే సమయంలో ప్రజలకు నమ్మకమైన రక్షణ కవచంగా నిలిచిందన్నారు. గతంలో 12 అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు జిల్లాలో ప్రాపర్టీ అఫెన్సెస్కు పాల్పడ్డాయని, ఆపరేషన్ కవచ్తో వారిని కట్టడి చేశామన్నారు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించడంతో రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్లుగా తప్పించుకొని తిరిగిన ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలను పట్టుకున్నట్టు వివరించారు. 5,16,984 వాహనాలను తనిఖీ చేశామని, 1,19,052 మందిని పాపిలాన్ పరికరం ద్వారా పరిశీలించి 209 మంది అనుమానితులను గుర్తించామని తెలిపారు. 1,08,118 మందికి డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు చేసి 3,572 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. రూ.2.01 కోట్ల విలువైన 404 కిలోల గంజాయిని పట్టుకొని ఆరు ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేయడంతోపాటు 18 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 8 లారీలు, మూడు ట్రాక్టర్లు, మూడు పశువుల అక్రమరవాణా కేసులు, మూడు పీడీఎస్ బియ్యం అక్రమరవాణా కేసులు నమోదు చేశామని తెలిపారు. దొంగిలించిన 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు ఐదు దేశీయ తుపాకులు, ఒక ఎయిర్ గన్ పట్టుకున్నామని వివరించారు. ఆలయ దొంగతనాలు, ఆస్తి నేరాలు, ఏటీఎం దొంగతనం కేసులు ఛేదించామన్నారు. నంబర్ ప్లేట్లు సరిగా లేని, అసలే లేని 70 వాహనాలను పట్టుకున్నామని, పెండింగ్ చలానాలకు సంబంధించి రూ.22.52 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్లలో అసాధారణ ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని నగదు పురస్కారాలతో అభినందించినట్లు ఎస్పీ వివరించారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాస్రావు, విఠల్రెడ్డి సీఐలు నరహరి, నరేశ్, శ్రీధర్, సంతోష్ తదితరులు ఉన్నారు.
గాంధారి మండలం మొండిసడక్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోతున్న ఎనిమిది మంది అడవి జంతువుల వేటగాళ్లను వెంబడించి పట్టుకు న్నారు. వారి నుంచి ఐదు నాటు తుపాకులు, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన బందది పెంటయ్య అనే రైతు ట్రాక్టర్ను పొలం నుంచి తీసుకెళ్తున్న దొంగల ముఠాను సదాశివనగర్ మండలం పద్మాజివాడీ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు.
నాగిరెడ్డిపేటలో ఆటో దొంగిలించి పారిపోతున్న దుండగులను పోలీస్ సిబ్బంది ఎనిమిది కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. 43 కేసుల్లో ఉన్న ప్రధాన నిందితుడు సహా నలుగురు పోలీసులకు చిక్కారు.
సదాశివనగర్ ఎల్లమ్మగుడిలో చోరీతోపాటు లింగాపూర్లో జరిగిన దోపిడీ కేసులో డయల్ 100 సమాచారంతో కంట్రోల్ రూం అప్రమత్తమై జియో ఫెన్సింగ్ పద్ధతిలో డ్రెస్కోడ్ ఆధారంగా పాత నేరస్తుడిని చాకచక్యంగా పట్టుకున్నారు.
తల్లి మందలించిందనే మనస్తాపంతో నిజామాబాద్ నుంచి సైకిల్పై 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టేక్రియాల్కు వచ్చిన 14 ఏళ్ల బాలుడిని దేవునిపల్లి పోలీసులు గమనించారు. బాలుడికి కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.


