● వాహనాలను అప్రమత్తంగా నడపాలి
● ఎస్పీ రాజేశ్ చంద్ర
● డ్రైవర్లకు ఉచిత కంటివైద్య శిబిరం
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంన్నామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వాహనాలను అప్రమత్తంగా నడపాలని డ్రైవర్లకు సూచించారు. ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో బుధవారం డ్రైవర్లకు ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి నెలా చివరి వారంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల ఫలితంగా రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నదన్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదాల్లో 22 మరణాలు సంభవించగా, 2025 ఫిబ్రవరిలో 14 మరణాలు, ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 మరణాలు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. శిబిరంలో భాగంగా మొత్తం 136 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, వైద్యుల సహకారంతో సుమారు 20 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. చికిత్సలు అవసరమైన వారికి డోనర్ల సహకారంతో పోలీస్ శాఖ తరఫున చికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ ఎస్హెచ్వో నరహరి, ట్రాఫిక్ ఎస్సైలు మహేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


