కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఇటీవల 38వ వార్డులో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా, దొంగ ఓట్లతోనే కౌన్సిలర్గా విజయం సాధించారని ఆ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగ మాధవి సంచలన ఆరోపణలు చేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాకు బీఫామ్ ఇచ్చినా, పార్టీలోని ముఖ్య నాయకులే స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయాలని కార్యకర్తలకు ఫోన్ చేసి చెప్పడం దారుణం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేట నుంచి 15 మందిని, అలాగే జంగంపల్లికి చెందిన ఓ టీచర్ వంటి వారిని 38వ వార్డులో దొంగ ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. ఇతర వార్డుల నుంచి 66, కమర్షియల్ షట్టర్ల చిరునామాలపై 45 ఓట్లు, వార్డులోని ఓ వర్గం ఇళ్లపై మరో వర్గానికి చెందిన 25 ఓట్లు చేర్చారని వాటితో అక్రమంగా గెలుపొందారని విమర్శించారు. జనవరి 8నే అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమకు ఓటు వేసిన వారిని చైర్పర్సన్ వర్గీయులు ఫోన్లలో బెదిరిస్తున్నారని రంగ మాధవి దంపతులు ఆరోపించారు. గత 3 పర్యాయాల ఎన్నికల్లో స్వల్ప ఓట్లతోనే, ఈసారీ కేవలం 3 ఓట్లతోనే ఓడిపోయామని, ఈ వర్గ పోరులో తాము బలైపోయామని కంటతడి పెట్టుకున్నారు. ఆధారాలతో వార్డులో రీపోలింగ్ నిర్వహించాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వంటి నేతలు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా
పట్టించుకోలేదు
అందుకే కోర్టును ఆశ్రయించాం
కామారెడ్డి 38వ వార్డు
అభ్యర్థి రంగ మాధవి


