కామారెడ్డి క్రైం: ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల అధికారులకు కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. మార్చి 6 నుంచి 15 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యావరణ పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. మొదటి రోజు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రముఖులు, ప్రజల సమక్షంలో కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలన్నారు. కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానంపై అవగాహన కల్పించేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులకు మార్చి 12 న జిల్లావ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జెడ్పీ సీఈవో చందర్, ఆర్డీవోలు, అన్ని శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


