● వికసిత్ భారత్ యువ పార్లమెంట్లో అదనపు కలెక్టర్ మధుమోహన్
కామారెడ్డి టౌన్: దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం వికసిత్ భారత్ యువ పార్లమెంట్– 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. తెయూ సౌత్ క్యాంపస్ ఎన్ఎస్ఎస్ విభాగం, మేరా యువ భారత్ కామారెడ్డి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం విజయవంతం కావడానికి యువత భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మహిళా సాధికారత, వ్యవసాయ రంగం, సాంకేతిక ఆవిష్కరణలపై యువత తమ గళాన్ని వినిపించాలని కోరారు. మై భారత్’ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు నిర్ణీత అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యాస్మిన్ సుల్తానా, సుదీక్షారెడ్డి, అంజలి, సుధాంశు, హర్షిణిలను రాష్ట్ర స్థాయి యువ పార్లమెంట్కు ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి, తెయూ ఎన్ఎస్ఎస్ ప్రొఫెసర్ అపర్ణ, ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం, డీవైఎస్వో వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


