బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 31,695 నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 7,335 నోటీసులు డెలివరీ అయ్యాయని, మిగిలిన 24,360 నోటీసుల డెలివరీ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో బూత్ స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు హక్కు పొందాలని సూచించారు. క్లెయిమలు, అభ్యంతరాల నమోదుకు తుది గడువు 30వ తేదీ అని, వీటిని సెప్టెంబరు 28 లోపు పరిష్కరిస్తారన్నారు. అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురితమవుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో డి.తిప్పే నాయక్, ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.
సంతృప్త స్థాయి పెంచాలి
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని మరింత వేగవంతం చేసి ప్రజల సంతృప్త స్థాయిని పెంచాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితర అధికారులతో సమీక్షించారు. పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో మంచిగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పింఛన్ నిధులతో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రికార్డులను కలెక్టరేట్కు సమర్పించాలన్నారు.
తగ్గని పచ్చకామెర్లు
● కట్టమూరులో వైద్య శిబిరం
● ఇంటింటా ఆరోగ్య సిబ్బంది సర్వే
పెద్దాపురం: మండలంలో కట్టమూరు గ్రామంలో వారం రోజులుగా కలుషిత నీరు, ఆహారం వల్ల చిన్నారులు, వృద్ధులు పచ్చకామెర్లతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మేరకు స్థానిక సీహెచ్సీలో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. చాలా మంది గ్రామంలో ఆర్ఎంపీల వద్ద, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ఆదేశాల మేరకు స్థానిక డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రశాంతి పర్యవేక్షణలో కాండ్రకోట పీహెచ్సీ వైద్యులు డాక్టర్ చంద్రకిరణ్బాబు తదితరులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించారు. అనుమానితులకు రక్షపరీక్షలు నిర్వహించి వాటిని ల్యాబ్కు పంపించారు. ఎంపీడీవో కె.సూర్యనారాయణ పర్యవేక్షణలో గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. క్లోరినైజేషన్ చేసిన రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో ఎవరూ ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద ఆహారం తినకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
పిఠాపురం: రేషన్ బియాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసి, 29.640 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మోహన్నగర్ – గోర్స రోడ్డులో లారీలో తరలిస్తున్న 29.640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ డీటీ సమక్షంలో పట్టుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.14.22 లక్షలు ఉంటుందని తెలిపారు. లారీని సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
డీసెట్ రెండో దశ
కౌన్సెలింగ్ ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: ఏపీ డీసెట్– 2026లో అర్హులైన అభ్యర్థులకు ప్రైవేట్ డీఎల్ఎడ్ కళాశాలలో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి గురువారం నుంచి రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని బొమ్మూరులోని డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న వెబ్ ఆధారిత ఆప్షన్ల్ల నమోదుకు అవకాశం ఇచ్చారన్నారు. శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.


