● స్టైపెండ్ పెంపుతో పాటు
డిమాండ్ల సాధనకు పోరు
● జీజీహెచ్లో విధుల బహిష్కరణ
సాక్షి, రాజమహేంద్రవరం: డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు సమ్మె బాట పట్టారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్య డైరెక్టర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు సమ్మెలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలకు కొంత విఘాతం కలిగే ప్రమాదం ఉంది. సుమారు 40 మందికి పైగా సమ్మెలో పాల్గొంటున్నారు.
పేద రోగులకు ఇబ్బందే..
సమ్మెలో భాగంగా ఓపీ సేవలకు దూరంగా ఉన్నప్పటికీ అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో ఉంటామని జూడాలు తెలిపారు. అయితే ఆస్పత్రిలో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు చేయడం, పరీక్షల నిర్వహణలో పీజీ వైద్యులు, జూడాలదే కీలక పాత్ర. ప్రస్తుతం వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి జీజీహెచ్కు వచ్చే వేలాది రోగులు, వృద్ధులు, గర్భిణులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఇప్పటికే ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


