కాకినాడ లీగల్: ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సోమవారం కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు నల్లబ్యాడ్జీలు ధరించి పెన్డౌన్ చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీజే ప్రసాద్, కాకినాడ దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలకు అందుతున్న సేవలన్నింటినీ తామే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. ఆస్తులకు సంబంధించి టైటిల్ డీడ్, ఈసీ, రెవెన్యూ రికార్డుల పరిశీలన, ఆస్తి కొలతల అనంతరం దస్తావేజులు తయారు చేసి, క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రతి దస్తావేజుపై రూ.2 వేల అదనపు రుసుము వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు. జీవో 396ను ఉపసంహరించుకుని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. దస్తావేజు లేఖర్ల పెన్డౌన్కు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి సుబ్రహ్మణ్యం, న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
విద్యారంగం
బలోపేతానికి కృషి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా అవార్డులకు సంబంధించిన షైనింగ్ స్టార్స్–2026 కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 135 మంది పదో తరగతి విద్యార్థులకు, 173 మంది ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ప్రతిభ పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు.


