అన్నవరం: రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా అన్నవరం పేరుగాంచింది.. నిత్యం వేలాది మంది భక్తుల రాకతో సందడిగా ఉంటోంది.. అలాంటి దేవస్థానం పరిపాలనలో కీలకమైన కార్యనిర్వహణాధికారి (ఈఓ) పోస్టును ఇన్చార్జులతోనే నెట్టుకురావడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా డిఫ్యూటీ కమిషనర్ స్థాయి అధికారి, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు కొనసాగుతున్నారు. గత ఏప్రిల్ 16న ఆయన నియమితులయ్యారు. మూడు నెలలుగా వారానికి మూడు రోజులకు తక్కువ కాకుండా అన్నవరం దేవస్థానంలోనే ఉంటూ పాలన సాగిస్తున్నారు. వీలును బట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకూ అన్నవరం దేవస్థానంలో, శనివారం నుంచి సోమవారం వరకు వాడపల్లిలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు కోసం తీవ్ర పోటీ ఉంది. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఒకరిద్దరు దేవదాయశాఖ డీసీ క్యాడర్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు రెగ్యులర్ ఈఓను నియమించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్టు సమాచారం.
ఆ అవకాశం లేదు..
రెవెన్యూ శాఖకు చెందిన వారిని ప్రస్తుతం ఈఓలుగా నియమించే అవకాశం లేదని సమాచారం. గతంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను అన్నవరం దేవస్థానం ఈఓలుగా నియమించారు. ఇందులో 2002–03 సంవత్సరాల్లో ఎంవీ శేషగిరిబాబు, 2013–14లో ప్రసాదం వెంకటేశ్వర్లు, 2015–17 మధ్య కాకర్ల నాగేశ్వరరావు, 2017–18 మధ్య పనిచేసిన ఎం.జితేంద్ర దేవస్థానం అభివృద్ధికి కృషి చేశారు. 2024–25 మధ్య వీర్ల సుబ్బారావు పనిచేశారు. అనంతరం 2025 డిసెంబర్లో ఇన్చార్జి ఈఓగా దేవదాయ శాఖకు చెందిన రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్న వి.త్రినాథరావును నియమించారు. ఆ తరువాత ఆయనను ద్వారకాతిరుమల ఈఓగా బదిలీ చేసి ఆయన స్థానంలో ఈ ఏడాది ఏప్రిల్లో వాడపల్లి ఈఓ పనిచేస్తున్న నల్లం సూర్యచక్రధరరావును ఇన్చార్జి ఈఓగా నియమించారు. ప్రస్తుతం సూర్యచక్రధరరావుతో సహా చాలా మంది డిప్యూటీ కమిషనర్లు ఆర్జేసీ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పదోన్నతులు పూర్తయ్యాకే అన్నవరం దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమిస్తారని సమాచారం.
ఫ అన్నవరం దేవస్థానంలో
భర్తీకాని ఈఓ పోస్టు
ఫ శాశ్వత నియామకం ఎప్పటికో?


