సరిహద్దులో తోడేళ్లు..! | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులో తోడేళ్లు..!

Jul 21 2026 1:14 AM | Updated on Jul 21 2026 1:14 AM

పేట్రేగుతున్న ఇసుకాసురులు

తెలంగాణ టు కర్ణాటక..

రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గం కృష్ణా మండలం టైరోడ్డు సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద కృష్ణానది పరివాహకంలో గతేడాది ఇసుక మాఫియా ఆధ్వర్యంలో నదిలో సుమారు ఆరు కి.మీ.ల మేర మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం దీన్ని వదిలేసిన ఇసుకాసురులు వాసునగర్‌ వద్ద రెండు, ముడుమాల్‌ వద్ద ఒకటి మొత్తంగా మూడు చోట్ల నదికి అడ్డంగా మట్టి రోడ్లు వేసి దందా కొనసాగిస్తున్నారు. వరద వచ్చినప్పడు నీరు సజావుగా వెళ్లేలా సిమెంట్‌ పైపులతో తూములు ఏర్పాటు చేశారు. నది ప్రవహిస్తున్న క్రమంలో తప్పితే మిగతా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జేసీబీ, హిటాచీలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పగలు నది నుంచి ఇసుకను తోడి సమీప పొలా ల్లో డంప్‌ చేయడం.. రాత్రి 8 గంటల తర్వాత ఆయా ప్రాంతాల నుంచి కర్ణాటకకు చెందిన 12 చక్రాల బెంజ్‌ వాహనాల్లో యాద్గిరి, సైదాపూర్‌, గుల్బర్గా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో బెంజ్‌ ఇసుకను దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.

● ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుకను వరంగా మార్చుకున్న ఆ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి నేతలు కొందరు తెలంగాణ బార్డర్‌ దాటిస్తూ దోపిడీకి తెగబడ్డారు. సరిహద్దులు దాటి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రాత్రివేళల్లో ఇసుక రవాణా చేస్తున్నారు.

● తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో కృష్ణానది పరివాహకంలో దర్జాగా రోడ్లు వేసి నదీ గర్భాన్ని తోడుతున్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి.. కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు.

..రోజు, నెల వారీ మామూళ్లతో ప్రభుత్వ యంత్రాంగాన్ని కట్టిపడేసి, తెలంగాణ సరిహద్దు కేంద్రంగా దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యనేతల అండదండలతో ‘హద్దు’లు దాటిన ఇసుకాసురుల బాగోతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రికి చెందిన ఓ అధికారిక రీచ్‌తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి కూటమి నేతల సహకారంతో ఆయా ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుక వాహనాలను కర్నూలు మీదుగా జాతీయ రహదారి మార్గంలో గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా గుండా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాత్రివేళల్లో నిత్యం 50 నుంచి 60 వరకు బెంజ్‌ వాహనాల్లో ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇందులో అధికంగా 16 టైర్ల లారీల్లోనే తరలిస్తున్నారు.

అక్కడ రూ.10 వేలు.. ఇక్కడ రూ.లక్ష

ఏపీ టు తెలంగాణ..

ఏపీలోని తాడిపత్రి, కర్నూలు నుంచి తెలంగాణకు ఉచిత ఇసుక..

నారాయణపేట జిల్లా కృష్ణానదిలో దర్జాగా రోడ్లు వేసి దందా

భారీ యంత్రాలతో తోడి కర్ణాటకలోపలు చోట్లకు తరలింపు

బార్డర్‌లో మాఫియాకు

ముఖ్య నేతల అండదండలు

కృష్ణా మండలంలో

నిర్వాహకుల బరితెగింపు

ప్రశ్నించిన వారికి బెదిరింపులు, పలువురిపై దాడులు

ఏీపలో ఉచిత ఇసుక నేపథ్యంలో అక్కడ ఒక లారీ లేదా బెంజ్‌ లోడ్‌కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. చౌకగా లభిస్తుండడంతో ఇసుక మాఫియా హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలించి దూరాన్ని బట్టి టన్నుకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 16 టైర్ల బెంజ్‌ ఇసుక (47 టన్నులు.. అయితే పరిమితి మించి అదనంగా 25 నుంచి 30 టన్నుల వరకు వేస్తారు)ను కనిష్టంగా రూ.84 వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement