గద్వాల: నీట్ పేపర్లలో లీక్తోపాటు దేశవ్యాప్తంగా పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, దేశంలో ప్రశ్నించే గొంతులపై నిర్బంధాన్ని ఆపాలని అఖిలపక్ష నేతలు ప్రభాకర్, ప్రకాశ్గౌడ్, మధుసూదన్బాబు అన్నారు. సోమవారం వారు జిల్లాకేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ధర్నా నిర్వహించి మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థుల భవిత్యం కోసం సీజేపీ వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను నిరంకుశత్వంతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. ప్రభుత్వం తన తప్పిదాలను సరిచేసుకోకుండా విద్యార్థుల పక్షాన నిలబడుతున్న సోనమ్ వాంగ్చుక్ వంటి మేధావులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఎత్తిచూపడానికి సైతం స్వేచ్ఛ లేకుండా ప్రతిపక్షాలను అణచివేస్తున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరి సమర్థనీయం కాదన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే పనులు మానుకోవాలని హితవు పలికారు. తక్షణమే సోనమ్ వాంగ్చుక్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, పల్లయ్య, సుభాన్, వినోద్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


