Telagnana Crime News: విచ్చలవిడిగా.. బైక్‌ డ్రైవింగ్‌ చేస్తూ.. చివరికి..
Sakshi News home page

విచ్చలవిడిగా.. బైక్‌ డ్రైవింగ్‌ చేస్తూ.. చివరికి..

Published Wed, Sep 6 2023 1:24 AM

- - Sakshi

జోగులాంబ: వింత పోకడలు ఎక్కువైపోయాయి. సరదా వ్యసనాలపై మోజు పడుతూ రోడ్డుపై బైక్‌లను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. పిల్లలపై నిఘా పెట్టకపోవడంతో పలువురు మైనర్లు మద్యానికి అలవాటు పడుతూ వారి జీవితాన్ని చేజేతులా అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. జిల్లాలోని మైనర్ల చేతిలో బైక్‌ ఉంటే.. వారి స్పీడ్‌కు కళ్లెం వేయలేని దుస్థితి ఏర్పడింది. ఇదే వారి జీవితంలో రాంగ్‌ రూట్‌గా మారింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి కటకటాలపాలైన సంఘటనలు ఉన్నాయి.

వక్రమార్గంలో వెళ్లకుండా..
స్నేహితుల్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే చాలు పట్టణ శివారు ప్రాంతాల్లో అర్ధారాత్రి 12 గంటలు దాటగానే నడిరోడ్డుపైకి వచ్చి కేక్‌ కట్‌ చేసి హంగామా చేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద చిన్నారులకు మద్యం విక్రయించబోమనే నిబంధన ఉన్నా.. అమలు కావడం లేదు. రాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్‌ సమయంలో పోలీసులకు దొరికిన సంఘటనలు ఉన్నాయి.

వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది. తల్లిదండ్రులు ఇప్పటికై న మేల్కొని తమ పిల్లలపై నిఘా పెట్టి వక్రమార్గంలో వెళ్లకుండా చూసుకోవాలి. ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు, సామగ్రి చోరీ చేయడం వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించి వచ్చిన నగదుతో మద్యం, పొగాకు, పాన్‌మసాల, జర్ధ తదితర వాటిని తీసుకుంటున్నారు.

పరోక్షంగా ప్రోత్సాహం..
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు బైక్‌ నేర్పిస్తుంటారు. అయితే వారి చేతికి బైక్‌ ఇవ్వడం తప్పని తెలిసినా.. ఏదైనా పని ఉంటే ఆసరా అవుతారనే భావనతో తల్లిదండ్రులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలేమో సరదాగా ఇద్దరు, ముగ్గురు స్నేహితులను ఎక్కించుకుని బైక్‌లపై దూసుకెళ్తున్నారు. స్పీడ్‌ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి కిందపడిన సంఘటనలు ఉన్నాయి.

అయితే తల్లిదండ్రులు వారిని నిలువరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీల్లో మైనర్లు బైక్‌ డ్రైవింగ్‌ చేస్తూ.. పట్టుబడుతున్నారు. ఈ ఏడాది 60కు పైగా కేసులు నమోదయ్యాయి. జరిమానా రూపంలో రూ.26 వేలు విధించారు. ఆగస్టు 15న మైనర్లు రోడ్డుపై బైక్‌లతో చేసిన హంగామా అంతా ఇంత కాదు. వారిని నిలువరించే క్రమంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐకి గాయాలయ్యాయి. వ్యసనాలకు అలవాటు పడిన ముగ్గురు మైనర్లు డబ్బులు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. చోరీల దారిని వెతుకున్నారు. నూతన నిర్మాణంలోని ఇళ్లలో కాపర్‌ వైర్‌, ఇనుప కడ్డీలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న క్రమంలో పట్టుబడి కటకటాలపాలయ్యారు.

17 ఏళ్ల బాలుడు ప్రేమ పేరిట పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వేంధిపులకు గురిచేశాడు. బాలికను బయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి జువైనెల్‌ హోంకు తరలించారు. యుక్త వయస్సులోనే చెడు అలవాట్లకు గురవుతున్నారు. మరోవైపు నిత్యం రోడ్డుపై మైనర్లు బైక్‌లను పరిమితికి మించిన వేగం, శబ్ధ కాలుష్యం, విన్యాసాలు, సినిమా తరహాలో బైక్‌ చేజింగ్‌లతో పోటీ పడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement