● మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి: కాంగ్రెస్ సర్కారు రైతుల పాలిట శాపంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక చెరువులు నిండక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సింది పోయి, దేవాదుల మోటార్లు మొత్తం నడపడం లేదన్నారు. రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తీసుకురావడానికి బీఆర్ఎస్ హయాంలో రూ.18కోట్లు వెచ్చించగా, ఆ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సాగునీటిని తెచ్చే మార్గాలు ఉన్నప్పటికీ పంటలను ఎండబెట్టడం బాధాకరమన్నారు. వెంటనే గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించలేక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సిగ్గుచేటన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో గణపురం, భూపాలపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


