న్యూస్రీల్
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026
అరకొర వేతనం..
● అప్పుల ఊబిలో కార్మికులు
● బడి ఊడ్చే చేతికి మిగిలింది శూన్యం
నెలకు కేవలం రూ.3వేలు.. మహా అయితే రూ.6వేలు లేదా రూ.8వేలు. ప్రస్తుత కాలంలో ధనవంతులకు ఒకరోజు హోటల్ బిల్లు లేదా ఒక కుటుంబానికి వారం రోజుల నిత్యావసరాలకు సరిపోని డబ్బులు. కానీ ఈ అరకొర వేతనమే ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్ల జీవిత ఆధారం. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి రోజూ పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచే స్కావెంజర్లకు ఆరు నెలలుగా పైసా జీతం అందడం లేదు. స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ పాఠశాల అంటున్న ప్రభుత్వాలు, పాలకులు ఆ స్వచ్ఛత వెనుక ఉన్న కార్మికుల కష్టాన్ని మాత్రం గుర్తించడం లేదు. నిత్యావసర వస్తువులు కొనలేక, కుటుంబాలను పోషించుకోలేక జిల్లాలోని స్కావెంజర్లు నరకయాతన పడుతున్నారు.
– భూపాలపల్లి అర్బన్
500 మంది స్కావెంజర్లు..
జిల్లాలోని 400 పాఠశాలల్లో సుమారు 500 మంది స్కావెంజర్లు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పనులు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.3,000, రూ.6,000, రూ.8,000 చొప్పున వేతనం నిర్ణయించారు. స్కావెంజర్లకు ప్రతి నెలా రూ.18లక్షల వేతనం చెల్లిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80కోట్లు మంజూరుచేసింది. గత విద్యా సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ విద్యా సంవత్సరంలోని జూన్ మాసానికి సంబంధించిన వేతనాలు రావాల్సి ఉంది. వేతనాలు నిలిచిపోవడంతో నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్కావెంజర్లు వాపోతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దె, వైద్య ఖర్చులు, ఇతర కుటుంబ అవసరాలు తీర్చలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎంఎఫ్టీ నుంచి
అమ్మ ఆదర్శ పాఠశాలల ఖాతాల్లోకి..
స్కావెంజర్లకు సంబంధించిన వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం లేదు. కలెక్టర్ తన పరిఽధిలో ఉండేటువంటి డీఎంఎఫ్టీ బడ్జెట్ నుంచి వేతనాలు చెల్లిస్తారు. ఈ వేతనాలు నేరుగా స్కావెంజర్లకు కాకుండా పాఠశాలలకు సంబంధించిన అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమిటీ చైర్మన్లు విడుదల చేసి స్కావెంజర్లకు ఇస్తున్నారు.
పాఠశాలల పరిశుభ్రతపై ప్రభావం
స్కావెంజర్లు పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వేతనాలు లేక నిరుత్సాహానికి గురైతే పాఠశాలల పరిశుభ్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆరునెలలుగా స్కావెంజర్లకు
అందని వేతనాలు


