న్యూస్రీల్
మంగళవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2026
భూపాలపల్లి: జిల్లాలో వరిసాగుపై నీలినీడలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు నిండకపోవడం, పంట పొలాల్లో నీరు నిల్వకపోవడంతో వరినారు కోసం రైతులు వడ్లు అలకడం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వరిసాగు పూర్తిస్థాయిలో జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చేతికొచ్చిన నారు 320 ఎకరాల్లోనే..
జిల్లాలోని 12 మండలాల్లో ఈ ఏడాది 1,12,213 ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఎల్నినో ప్రభావంతో జూన్, ఈ నెలలో వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. ఇటీవల కురిసిన వర్షాలు పత్తి పంటలకు ప్రాణం పోసినప్పటికీ వరిసాగుకు అనుకూలంగా లేవు. ప్రతీ ఏటా జూలై నెలలో వరినారు చేతికొచ్చి చివరి వారంలో నాట్లు వేసేవారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కనీసం నారుమడులు సిద్ధం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. బోర్లు, బావులు ఉన్న వారు మాత్రం ఇప్పుడిప్పుడే నారుమడుల సిద్ధం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మునుపెన్నడూ లేని విధంగా కేవలం 320 ఎకరాలు కొత్తపల్లిగోరి మండలానికి చెందిన రైతులు వడ్లు అలికి నారు సిద్ధం చేసుకున్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
వరిసాగుపై ఎల్నినో ఎఫెక్ట్..
వరిసాగుపై ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో నూటికి 60 శాతం మంది రైతులు వర్షాల మీదనే ఆధారపడి వరిసాగు చేస్తుంటారు. కొంతమందికి మాత్రమే బోర్లు, బావులు ఉన్నాయి. మిగిలిన వారంతా భీంఘన్పూర్ రిజర్వాయర్, గణపసముద్రం తదితర చిన్న, పెద్ద చెరువులు, రిజర్వాయర్లపై ఆధారపడి వరిసాగు చేస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆయా జలాశయాల్లో నీరు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉష్ణోగ్రత తగ్గి ప్రతీరోజు మబ్బులు వస్తూ వాతావరణం చల్లబడుతున్నా చిరుజల్లులు తప్ప భారీ వర్షాలు మాత్రం కురియడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఎల్నినో ఎఫెక్ట్తో ఈ ఏడాది వరిసాగు తీవ్ర స్థాయిలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ వంగడాల సాగుకు రైతుల మొగ్గు..
రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందిస్తున్న ఏడు వంగడాలను మాత్రమే సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. బీపీటీ 5,204, ఆర్ఎన్ఆర్ 15048, హెఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 వంగాలనే రైతులు కొనుగోలు చేస్తున్నారు. కేఎన్ఎం 7715తో పాటు ఒకటి, రెండు రకాల వరి విత్తనాలు జిల్లాలో అందుబాటులో లేకపోవడంతో రైతులు వరంగల్ తదితర పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
అందుబాటులో అన్ని రకాల వంగడాలు
రైతులు ప్రధానంగా సాగుచేసే అన్ని రకాల వరి వంగడాలను అందుబాటులో ఉంచాం. వరిసాగుకు రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం తక్కువగా కురిసినందున కొంతమంది రైతులు మాత్రమే నాట్లు వేశారు. మరిన్ని వర్షాలు కురిస్తే.. సుమారు లక్ష ఎకరాలకు పైగా వరిసాగు జరుగుతుందని అంచనా వేశాం.
– బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి
నారుమడులు సిద్ధమైంది
320 ఎకరాల్లోనే..
వర్షాల కోసం ఎదురుచూస్తున్న
అన్నదాతలు
ఏడు రకాల వంగడాల వైపు
రైతుల చూపు
దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు


