ఇలాగైతే ఎలా సర్‌..! | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ఎలా సర్‌..!

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో క్షేత్రస్థాయి పని ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో దాదాపు పూర్తయినా.. కీలకమైన డిజిటైజేషన్‌ మాత్రం ముందుకు కదలడం లేదు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం 30.53 లక్షల ఓటర్లలో 98.22 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసిన అధికారులు.. వాటిలో కేవలం 8.91 శాతాన్నే డిజిటల్‌ వ్యవస్థలో నమోదు చేయగలిగారు. అన్ని జిల్లాల్లోనూ 96 నుంచి 99.22 శాతం వరకు ఈఎఫ్‌ల పంపిణీ పూర్తయిందని రికార్డులు చెబుతుండగా, పంపిణీ చేసిన ఫారాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఏ జిల్లాలోనూ సంతృప్తికర స్థాయికి చేరుకోలేదు.

ఈఎఫ్‌ల పంపిణీలో వేగం..

డిజిటైజేషనే నత్తనడకన..

ఎన్యూమరేషన్‌ ఫారం (ఈఎఫ్‌)ల పంపిణీ మొదట కొంత మందగించిన తర్వాత వేగం పెరిగింది. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌లు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫారాలను తిరిగి తెప్పించడం, డిజిటైజేషన్‌ చేయడంలో కాలయాపన చోటు చేసుకుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2,75,468 (99.21 శాతం) ఈఎఫ్‌లు పంపిణీ చేసినట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే జిల్లాలో డిజిటైజేషన్‌ కేవలం 47,543 (10.25 శాతమే) పూర్తైంది. ఇది ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోనే అత్యధికం కావడం గమనార్హం. పంపిణీ చేసిన ఫారాల్లో అత్యధిక భాగం ఇంకా డిజిటల్‌ వ్యవస్థలో నమోదు కావాల్సి ఉంది. మహబూబాబాద్‌ జిల్లాలో 99.41 శాతం పంపిణీ చేసినా డిజిటైజేషన్‌ 7.80 శాతం మాత్రమే. ములుగులో 98.48 శాతం పంపిణీకి 13.88 శాతం, జనగామలో 99.65 శాతం పంపిణీకి 11.38 శాతం, వరంగల్‌లో 96.17 శాతం పంపిణీకి 5.40 శాతం, హనుమకొండలో 97.47 శాతం పంపిణీకి కేవలం 4.79 శాతం మాత్రమే డిజిటైజేషన్‌ అయ్యింది.

ఫీల్డ్‌లో పనిచేసిన శ్రమ వృథా అవుతోందా..?

బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల నిరక్షరాస్యత కారణంగా ఫారాలు తిరిగి సకాలంలో అందడం లేదు. వీటికి తోడు అందిన వివరాలను సకాలంలో డిజిటల్‌ వ్యవస్థలో నమోదు చేయకపోతే మొత్తం ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల వ్యవహారాలపై అవగాహన ఉన్న అధికారులు చెబుతున్నారు. పూర్తయిన తర్వాతే వివరాల పరిశీలన, అభ్యంతరాలు, తుది ఓటర్ల జాబితా తయారీ వంటి తదుపరి ప్రక్రియలు వేగం అందుకునే అవకాశం ఉంది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సిన నేపథ్యంలో డిజిటైజేషన్‌ ప్రక్రియలో వేగం పెరగాల్సి ఉంది. ‘సర్‌’పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో .. జిల్లాల కలెక్టర్లు కిందిస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ నెల 31న తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా..మరో 23 రోజులే మిగిలి ఉండటంతో డిజిటైజేషన్‌ వేగం పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

చదువు రాదు.. ఫారం ఎలా నింపాలి

ఓటర్ల ఫారాన్ని నింపడం కోసం నాలాంటి చదువురాని వాళ్లు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఫారం ఇచ్చి నింపి మళ్లీ ఇవ్వమన్నారు. చదువురాని నాలాంటి వాళ్లు ఫారాన్ని ఎలా నింపుతాం. చదువుకున్న వాళ్లను బతిమలాడాల్సి వస్తున్నది. ఓటర్లు బతికున్నారా లేదా చనిపోయారా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మళ్లీ కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తులు, ఫొటోలు ఇవ్వమంటున్నారు.

– బొజ్జు ఐలయ్య,

జఫర్‌గడ్‌ శివారు వడ్డెగూడెం

‘ఫారం’ ఇంటికొచ్చింది..

సిస్టంలోకి చేరలేదు

98.22 శాతం ఫారాల పంపిణీ.. డిజిటైజేషన్‌ మాత్రం 8.91 శాతం

పంపిణీలో దూకుడు..

నమోదు మాత్రం నత్తనడక

ఫైనల్‌ పబ్లికేషన్‌కు

మరో 23 రోజులే గడువు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో

‘సర్‌’పురోగతి..

జిల్లా మొత్తం ఈఎఫ్‌లు డిజిటలైజ్‌ చేసిన

ఓటర్లు పంపిణీ ఈఎఫ్‌లు

జేఎస్‌భూపాలపల్లి 2,77,882 2,75,468 47,543

హనుమకొండ 5,09,014 4,96,160 24,364

వరంగల్‌ 7,76,953 7,47,157 41,933

జనగామ 7,67,484 7,64,797 87,317

మహబూబాబాద్‌ 4,84,935 4,82,070 37,830

ములుగు 2,36,970 2,33,369 32,900

30,53,238 29,99,021 2,71,887

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement