భూపాలపల్లి రూరల్: సాయుధ పోరాటంలో నేలకొరిగిన తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచిపోయారని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇందిర అన్నారు. దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతిని శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందిర, బీసీ సంఘం నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన బంధనాల నుంచి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు కోరే సుధాకర్, కోరే కుమార్, నీలం రమేష్, స్వామి, సతీష్ పాల్గొన్నారు.


