● ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్
భూపాలపల్లి అర్బన్: భూసేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీల అమలులో వేగం పెంచాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు తెలిపారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, జెన్కో, సింగరేణి సంస్థలకు జరుగుతున్న భూసేకరణ ప్రక్రియపై శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి రెవెన్యూ, సర్వే, సింగరేణి, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సేకరణ అంశంపై పీఎన్, పీడీ, అవార్డు తదితర ప్రక్రియను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నిర్వాసితులకు అందించాల్సిన పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీలను ఆలస్యం లేకుండా, నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో అందించాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం ఈ అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజిలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూ సేకరణ పూర్తయితే తక్షణమే ఇరిగేషన్ శాఖకు భూములను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, జెన్కో సీఈ శ్రీప్రకాశ్, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.


